ఆ స్థానం నుంచి భారత్ను తొలగించండి: ఎఫ్ఏటీఎఫ్కు పాకిస్తాన్ అభ్యర్థన
ఇస్లామాబాద్: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)లోని ఆసియా - పసిఫిక్ జాయింట్ గ్రూప్ కో చైర్గా భారతదేశాన్ని తొలగించాలని పాకిస్తాన్ కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఉగ్రవాద సంస్థల ఆర్థిక మూలాలపై నిఘా ఉంచే టాస్క్ఫోర్స్. ఇటీవల ఉగ్రవాద ఆర్థిక వనరులను కట్టడి చేయడంలో పాకిస్తాన్ వైఫల్యం చెందిందని చెబుతూ ఎఫ్ఏటీఎఫ్ ఆ దేశాన్ని గ్రే లిస్ట్లో పెట్టింది. తదుపరి చర్యలు లేకుంటే బ్లాక్ లిస్ట్లో చేర్చే అవకాశముంది. ఈ మేరకు పాకిస్తాన్ను ఎఫ్ఏటీఎఫ్ హెచ్చరించింది. దీనిని జూన్ నెలలో సమీక్షించనున్నారు.
ఎన్ని దోమలు చనిపోయాయో లెక్కిస్తానా?: విపక్షాలకు వీకే సింగ్, డిగ్గీరాజాపై ఆగ్రహం
ఈ నేపథ్యంలో ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడికి పాక్ ఆర్థిక మంత్రి లేఖ రాశారు. భారత్ను ఆసియా -పసిఫిక్ జాయింట్ గ్రూప్ కోచైర్ నుంచి తొలగించి, మరో దేశాన్ని నియమించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్లాక్ లిస్ట్ విషయంలో వచ్చే జూన్ నెలలో సమీక్ష జరుగుతుందని, అది నిష్పక్షపాతంగా ఉండాలంటే తమ అభ్యర్థనను పరిశీలించాలని, పాక్పై భారత్ వైఖరి అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు.
పుల్వామా దాడి, సర్జికల్ స్ట్రైక్స్ దాడి అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయని, ఫిబ్రవరి 18న జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్థాన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలో సమీక్షా విభాగంలో భారత్ ఉంటే ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలన్న స్ఫూర్తికి విఘాతం కలిగే అవకాశముందని, పాకిస్తాన్ పట్ల భారత్ ప్రతికూల వైఖరి ప్రదర్శిస్తుందని తాము బలంగా నమ్ముతున్నామని పేర్కొంది.
కాగా, ఎఫ్ఏటీఎఫ్ విభాగమైన ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ రివ్యూ గ్రూప్ (ఐసీఆర్జీ)లో ఆసియా - పసిఫిక్ జాయింట్ గ్రూప్ ఓ భాగం. ఆసియా-పసిఫిక్ గ్రూప్లోని సభ్యదేశాల సమీక్షలు జరిపే బాధ్యత దీనిపై ఉంటుంది. దీనికి భారత ఫైనాన్షియల్ డైరెక్టర్ జనరల్ కోఛైర్గా ఉన్నారు. పాకిస్థాన్ను గ్రే లిస్ట్లో ఉంచడం వల్ల విదేశీ సంస్థల నుంచి ఆర్థిక సహకారం అందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఇది పాకిస్తాన్కు మరింత దెబ్బ కానుంది. అందుకే ఈ లేఖ రాసింది.