పెరుగుపై జీఎస్టీనా..? రూ.15,000 ఫైన్ కట్టండి..
తిరునల్వేలీ : నిబంధనలు పాటించని షాపులు, హోటళ్లు చాలానే ఉన్నాయి. ఆ ట్యాక్సులు.. ఈ పన్నులంటూ కస్టమర్లకు కుచ్చుటోపీ పెడుతుంటాయి. చిల్లరే కదా చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ అన్యాయాన్ని ప్రశ్నించేవారు మాత్రం కొందరే ఉంటారు. తిరునల్వేలీకి చెందిన ఓ వ్యక్తి అలాంటి పోరాటమే చేశాడు. పెరుగుపై జీఎస్టీ వేసినందుకు హోటల్ యాజమాన్యాన్ని కన్జ్యూమర్ ఫోరం కీడ్చి ఫైన్ కట్టించాడు.
పెరుగుపై రూ.2 జీఎస్టీ
తమిళనాడు చెందిన మహారాజన్ ఫిబ్రవరి 6న.. తిరునల్వేలీ కోర్టు సమీపంలోని ఓ హోటల్కు వెళ్లాడు. రూ.40 పెరుగు పార్శిల్ ఇవ్వమని కోరాడు. పార్శిల్తో పాటు చేతిలో పెట్టిన బిల్లు చూసి మహారాజన్ అవాక్కయ్యాడు. పెరుగు ఖరీదు రూ.40, జీఎస్టీ రూ.2, పార్శిల్కు రూ.2 కలుపుకొని మొత్తం రూ.44లు బిల్లు ఇచ్చాడు.
కన్యూమర్ ఫోరంలో ఫిర్యాదు
పాలు, పెరుగు, కూరగాయలను జీఎస్టీ నుంచి మినహాయించారన్న విషయాన్ని మహారాజన్ హోటల్ యజమానికి తెచ్చాడు. అయితే అదేమీ ఆయన పట్టించుకోకపోవడంతో బాధితుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. న్యాయవాది సాయంతో పిటీషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కన్జ్యూమర్ ఫోర్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులను విచారించింది. వారు పెరుగుపై జీఎస్టీ లేదని, పార్శిల్కు ఛార్జీలు వసూలుచేయడం చట్టవిరుద్ధమని చెప్పారు.
రూ.15,004 చెల్లించాలని ఆదేశం
కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వివరణతో ఏకీభవించిన ఫోరం తుది తీర్పు వెలువరించింది. కస్టమర్కు మనోవేదన కలిగించినందుకు రూ.10వేలు, కేసు ఖర్చుల కింద 15వేలు, జీఎస్టీ, పార్శిల్కు వసూలు చేసిన రూ.4తో కలిపి మొత్తం రూ.15,004 నెల రోజుల్లో చెల్లించాలని హోటల్ యజమానిని ఆదేశించింది. సకాలంలో డబ్బు చెల్లించని పక్షంలో ఆరు శాతం వడ్డీతో కలిపి ఆ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.