నలుగురు ఔట్, నలుగురు ఇన్.. మూడు కాంగ్రెస్, ఒకటి లోబోకు... ఇదీ సావంత్ క్యాబినెట్
పనాజీ : గోవాలో అధికార బీజేపీ బలం పెరగడంతో ఇన్నాళ్లు తమకు అండగా నిలిచిన వారిని మెల్లగా పక్కన పెడుతుంది. గోవా ఫార్వార్డ్ పార్టీ, ఇండిపెండెంట్ల నుంచి మంత్రి పదవులను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎఫ్పీ నుంచి మూడు, ఇండిపెండెంట్ నుంచి ఒకరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. వీరి స్థానాల్లో ఇటీవలే బీజేపీలో చేరిన 10 మంది కాంగ్రెస్ సభ్యుల నుంచి ముగ్గురు క్యాబినెట్ బెర్త్ దక్కనుంది.
ఇన్, ఔట్
గోవా డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్, జలవనరుల శాఖ మంత్రి వినోద్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయేశ్ . జీఎఫ్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. రెవెన్య మంత్రి రోహన్ మాత్రం ఇండిపెండెంట్. ఈ మేరకు వారిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నట్టు గోవా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. వారి స్థానాల్లో మైఖేల్ లోబో, ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. మంత్రివర్గంలో చేరేందుకు గోవా డిప్యూటీ స్పీకర్ మైఖేల్ తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఊహగానాలు
లోబోతోపాటు చంద్రకాంత్ కవలేఖర్, జెన్నిఫల్, ఫిలిప్ గోవా మంత్రివర్గంలో చేరబోతున్నారు. తెలగియో ఎమ్మెల్యే జెన్నిఫర్ .. పనాజీ ఎమ్మెల్యే అటనాసియో భార్య. ఇటీవలే అటనాసియో కూడా బీజేపీలో చేరారు. దీంతో అటనాసియో భార్య పేరు మంత్రివర్గంలో చోటు ఖాయమనే వార్తలు వినిపించాయి. కానీ సామాజిక సమీకరణాలు, ఇటీవలే పార్టీలో చేరికలు, హామీలతో ఆమెకు మంత్రి పదవీ లభించలేదు. దీనిపై లోబో స్పందిస్తూ .. మంత్రివర్గంలో చేరేందుకు జెన్నిఫర్ నిరాకరించారని తెలిపారు. స్వయంగా సీఎం కోరినా మంత్రి పదవీ వద్దన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త మంత్రులు కూడా పాల్గొంటారని సీఎం ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. వారికి కేటాయించిన శాఖకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారని తెలిపారు.
ఇదీ లెక్క
గోవా అసెంబ్లీలో 40 సీట్లు ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో బీజేపీ గోవా ఫార్వార్డ్ పార్టీ, ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అయితే విపక్ష కాంగ్రెస్ మాత్రం 15 ఎమ్మెల్యేలతో బలంగా ఉంది. సీఎల్పీ నేత చంద్రకాంత్ కవలేఖర్తోపాటు 10 మంది ఎమ్మెల్యేల కాషాయ కండువా కప్పుకొని ఆ పార్టీకి షాకిచ్చారు. దీంతో వారిలో ముగ్గురికి క్యాబినెట్లో బెర్త్ దక్కింది. ఇన్నాళ్లు క్యాబినెట్లో ఉన్న ముగ్గురు జేఎఫ్పీ, ఒక స్వతంత్రుడికి సీఎం ప్రమోద్ సావంత్ చెక్ పెట్టారు.