గృహ కొనుగోలుదారులకు చల్లని కబురు..! 12 నుంచి 5శాతానికి జీఎస్టీ తగ్గింపు..!!
న్యూఢిల్లీ/ హైదరాబాద్ : గృహ కొనుగోలుదారులకు శుభవార్త. నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) త్వరలో దిగిరానుంది. ప్రస్తుతం ఈ తరహా ప్రాజెక్టులపై 12 శాతం జీఎస్టీ ఉండగా, దీనిని 5శాతానికి తగ్గించాలని నిర్మాణ రంగంలో జీఎస్టీ అధ్యయన మంత్రుల బృందం (జీవోఎం) నిర్ణయించింది. గుజరాత్ డిప్యూటి చీఫ్ మినిష్టర్ నితిన్ పాటిల్ నేతృత్వంలోని ఈ బృందం స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లతో పాటు జీఎస్టీ భారం తదితర అంశాల అధ్యయనం చేసిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.
చౌక గృహాలపై 3 శాతం వస్తు సేవల పన్ను ..! ఏకాభిప్రాయానికి వచ్చిన మంత్రుల బృందం..!!
శుక్రవారం నిర్వహించిన తొలి సమావేశంలో మంత్రుల బృందం నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజక్టులకు జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి, చౌక గృహ ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు బృందం ఒక నివేదికను తయారు చేసి వారం లోపు జీఎస్టీ మండలి ముందు ఉంచనుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ దిశగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.
వారం రోజులలోగా జీఎస్టీ కౌన్సిల్కు నివేదిక..! సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం..!!
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గృహ ప్రాజెక్టులు, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో (ఐటీసీ) కలుపుకొని 12 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. వివిధ పన్నులను కలుపుకుంటే గృహ ప్రాజెక్టులపై జీఎస్టీ భారం 15 నుంచి 18 శాతం వరకు ఉంటోంది. ఇప్పటికే ధరలు చుక్కలనంటుతుండడంతో గృహాల కొనుగోలుదారులపై బిల్డర్లు జీఎస్టీ భారాన్ని మోపడం లేదు. దీనికి తోడు బిల్డర్లు ఐటీసీని కొనుగోలుదారులకు బదలాయించడం లేదన్న ఫిర్యాదులు కూడా అందుతున్నాయి.
వారం లోగా నివేదిక..! కసరత్తు చేస్తున్న వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు..!!
ఈ నేపథ్యంలో గత జనవరి నెల 10న సమావేశమైన జీఎస్టీ మండలి నిర్మాణ రంగంలోని జీఎస్టీ భారంపై అధ్యయనం జరిపేందుకు గాను వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో పాటిల్తో పాటు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్, కర్ణాటక ఆర్థిక మంత్రి కృష్ణబాయర్ గౌడ్, కేరళ ఆర్థిక మంత్రి థామస ఐజాక్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్, ఉత్తర ప్రదేశ్ ఆర్థిక మంత్రి ప్రదేశ్ రాజేష్ అగర్వాల్, గోవా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మౌవిన్ గోడినో తదితరులు సభ్యులుగా ఉన్నారు.
అన్నీ కలిసొస్తే అందుబాటులోకి గ్రుహాలు..! చౌకగా లభ్యం అయ్యే అవకాశాలు..!!
వీరితో పాటు శుక్రవారం నాటి సమావేశానికి ముంగంటివార్, బాదల్లు విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. జీఎస్టీ తగ్గింపుకు బృందంలోని మంత్రులంతా ఏకాభిప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. దీనిపై వారంలో కౌన్సిల్కు అందించి, వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ దిశగా నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఈ బృందం చర్చల్లో పాల్గొన్న అధికారులు వెల్లడించారు.