75స్వాతంత్ర్య దినోత్సవం నాటికి అందరికీ ఇళ్లు: మోడీ, ‘లంచం అవసరం లేదు’
అహ్మదాబాద్: '2022లో భారతదేశం తన 75వ స్వాతనత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికి భారతీయులందరికీ సొంతిళ్లు సమకూరాలన్నది నా కల' అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులే సొంతిళ్లు నిర్మించుకున్నారన్న వార్తలను మనం వింటూ వచ్చామని.. ఇకపై పేదలు కూడా సొంత ఇళ్లు సంపాదించుకున్నారన్న వార్తలూ మనం వింటామని ప్రధాని చెప్పారు.
Recommended Video
గురువారం గుజరాత్లో పర్యటిస్తున్న ఆయన రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వల్సద్ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన సుమారు లక్ష ఇళ్లలో గురువారం గృహ ప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా జజ్వా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
'ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంతిళ్లు పొందిన మహిళలతో ఈ రోజు నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. రక్షా బంధన్ పండుగకు ఆడపడుచులకు సొంతిళ్లు ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి ఏదీ ఉండదు. ఆ పండుగకు కొన్ని రోజుల ముందే గుజరాత్లోని లక్ష మంది మహిళలు సొంతిళ్లు పొందారు. అలాగే, భారతీయులందరికీ 2022లోపు సొంతిళ్లు ఉండాలన్నదే నా కల. ఆ ఏడాది భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. ఇప్పటి వరకు రాజకీయనాయకులు సొంతిళ్లు నిర్మించుకున్నారనే వార్తలనే మనం విన్నాం. కానీ, ఇప్పటి నుంచి పేదలు సొంతిళ్లు పొందారనే వార్తలు వింటాం' అని మోడీ అన్నారు.
'ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇళ్లు పొందేందుకు ఎటువంటి లంచాలు ఇచ్చుకునే అవసరం లేదు. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే మధ్యవర్తులను సంప్రదించాల్సిన పని లేదు. అప్పట్లో బ్యాంకులు పేదలకు అప్పులిచ్చే పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు అవి పేదల వద్దకే వచ్చి రుణాలిస్తామని అంటున్నాయి. గుజరాత్ నాకు ఎన్నో నేర్పించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు పొందడంలో మహిళలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా లంచం ఇచ్చే అవసరం రాలేదని నాతో చెప్పారు' అని నరేంద్ర మోడీ తెలిపారు.