అద్దె ఇల్లు కావాలని, ఇంటి యజమాని దారుణ హత్య
బెంగళూరు: అద్దె ఇల్లు కావాలని నమ్మించి ఇంటి యజమానిని అతిదారుణంగా గొంతు కోసి హత్య చేసిన సంఘటన బెంగళూరు నగరంలోని బాణసవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రామయ్య లేఔట్ లో నివాసం ఉంటున్న రాజు (40) అనే వ్యక్తి గురువారం రాత్రి 10 గంటలకు హత్యకు గురయ్యాడు.
రాజు వికలాంగుడు. రామయ్య లేఔట్ లో రాజుకు నాలుగు అంతస్తుల కట్టడం ఉంది. ఒక ఫ్లోర్ లో రాజు నివాసం ఉంటున్నాడు. మిగిలిన ఇండ్లు అద్దెకు ఇచ్చాడు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ముగ్గురు రాజు ఇంటి దగ్గరకు వెళ్లారు. అద్దె ఇల్లు చూపించాలని చెప్పారు.
రాజు మూడవ అంతస్తులోని ఇంటిని చూపించడానికి వెళ్లాడు. అదే సమయంలో నిందితులు అతని నోటికి ప్లాస్టర్ అతికించి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఇద్దరు అక్కడి నుండి పరారైనారు. రాజు ఎంత సేపటికి కిందకు రాకపోవడంతో అతని భార్య బయటకు వచ్చారు.
అదే సమయంలో ఒకరు కిందకు దిగి వెలుతున్నారు. ఎవరు నీవు అని ప్రశ్నిస్తే ఇల్లు శుభ్రం చెయ్యడానికి వచ్చానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చి ఆమె మూడవ అంతస్తు మీదకు వెళ్లి చూడగా రాజు హత్యకు గురైన విషయం వెలుగు చూసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజు మొదటి భార్యకు విడాకులు ఇచ్చి ఆరు నెలల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యతో కలసి నివాసం ఉంటున్నాడు. పోలీసులు పలు కోణాలలో కేసు దర్యాప్తు చేశారు.
అద్దె ఇండ్లు ఇప్పించే బ్రోకర్ మధు గురించి ఆరా తీశారు. అతను కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ పారిపోయాడని తెలుసుకున్నారు. ఆంధ్ర పోలీసుల సహకారంతో అతనిని అరెస్టు చేసి బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు.
రాజు మొదటి భార్యకు ఇంకా ఆస్తి పంపకాలు జరగేలేదని పోలీసులు అన్నారు. రాజును కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి బెదిరించి నగదు, ఆస్తి లాక్కోవాలని ప్లాన్ వేశారని, అయితే చివరికి హత్య చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.