ఆవుపేడతోచేసిన ఇళ్లపై అటామిక్ రేడియేషన్ ఉండదు, గోవధ ఆపితే..: కోర్టు కీలక వ్యాఖ్యలు
గాంధీనగర్: అక్రమంగా పశువులను రవాణా చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్లోని ఒక కోర్టు.. గోహత్యపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గోవధ ఆగిపోతే.. భూమిపై ఉన్న సమస్యలన్ని తీరిపోతాయని పేర్కొంది. తాపీ జిల్లా కోర్టు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తీర్పు సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఆవు పేడతో చేసిన ఇళ్లపై అణు వికిరణం ప్రభావం ఉండదన్నారు జడ్జీ సమీర్ వినోద్ చంద్ర వ్యాస్. అంతేగాక, గోమూత్రంతో నయం లేని వ్యాధులను కూడా నివారించవచ్చని తెలిపారు. మతం ఆవు నుంచి పుట్టిందన్నారు. అయితే, న్యాయమూర్తి చేసిన వాదనలకు శాస్త్రీయ ఆధారం లేదు.
నవంబర్లో జారీ చేసిన ఉత్తర్వు, గోసంరక్షణకు సంబంధించిన చర్చలన్నీ ఆచరణలోకి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది.
ఆవు ఒక జంతువు మాత్రమే కాదు, తల్లి. ఆవు 68 కోట్ల పవిత్ర స్థలాలు, 33 కోట్ల దేవతల సజీవ గ్రహం అని పేర్కొంది కోర్టు. కోర్టు.. వివిధ శ్లోకాలను ప్రస్తావిస్తూ, "ఆవులను బాధించినట్లయితే.. మన సంపద, ఆస్తి అదృశ్యమవుతుంది' అని వ్యాఖ్యానించింది.
గోవధను వాతావరణ మార్పులకు కూడా జడ్జి ముడిపెట్టారు. "ఈ రోజు ఉన్న సమస్యలు ఆవేశం, కోపం పెరగడం వల్లనే ఉన్నాయి. వీటి పెరుగుదలకు ఏకైక కారణం గోవుల వధ మాత్రమే. దీనిని పూర్తిగా నిషేధించే వరకు సాత్విక వాతావరణ మార్పు ప్రభావం చూపదు' అని కోర్టు స్పష్టం చేసింది.
గత ఏడాది ఆగస్టులో 16 ఆవులను అక్రమంగా రవాణా చేయడంపై ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. జీవిత ఖైదుతో పాటు, ఆ వ్యక్తికి రూ. ఐదు లక్షల జరిమానా కూడా విధించారు.