హౌసింగ్ మంత్రి సెల్ఫ్ క్వారంటైన్: జర్నలిస్టులు కూడా స్వీయ నిర్బంధంలోకి: 2000 దాటిన కేసులు
ముంబై: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో రికార్డులను బద్దలు కొడుతోన్న మహారాష్ట్ర.. మరో సరికొత్త సంకట స్థితిని ఎదుర్కొంటోంది. మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్.. సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. తాను సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్తున్నానని, కొందరు జర్నలిస్టులు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు. మంత్రి సెల్ప్ క్వారంటైన్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం.. ఓ పోలీసు అధికారి.
కర్నూలును దాటేసిన గుంటూరు: ఏపీలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు: ఆ నాలుగు జిల్లాల్లోనే
తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ముంబ్రా-కల్వ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓ పోలీసు అధికారితో ఆయన ఇటీవలే సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న లాక్డౌన్ స్థితిగతులపై ఆరా తీశారు. అక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ.. ఆ పోలీసు అధికారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అనారోగ్యానికి గురైన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా నిర్ధారితమైంది. దీనితో ఆ పోలీసు అధికారిని ఐసొలేషన్ వార్డుకు తరలించారు.
తాను సమీక్ష నిర్వహించిన పోలీసు అధికారి కరోనా వైరస్ పాజిటివ్గా తేలడంతో జితేంద్ర అవ్హద్ ఉలిక్కిపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా ఆయన సెల్ప్ క్వారంటైన్లోకి వెళ్లారు. అదే సమీక్షా సమావేశాన్ని కవర్ చేయడానికి వెళ్లిన కొందరు జర్నలిస్టులు కూడా ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించారు. ఆ సమావేశానికి హాజరైన విలేకరులు కూడా సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లాలని జితేంద్ర అవ్హద్ సూచించారు.
కాగా.. మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రెండువేల మార్క్ను అధిగమించాయి. సోమవారం మధ్యాహ్నానికి అందిన తాజా వివరాల ప్రకారం మహారాష్ట్రలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 82. దీనితో మొత్తం కేసుల సంఖ్య 2064కు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రం మరొకటి లేదు. కరోనా వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. రెండువేల మార్క్ను అధిగమించిన తొలి రాష్ట్రంగా ఎవరూ కోరుకోని రికార్డును నెలకొల్పింది.