క్షణక్షణం ఉత్కంఠ: ముంబైలో ఢిల్లీ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, ఐర్లాండ్ నుంచి ఫోన్, పోలీసులు గ్రేట్
న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. ఎక్కడో ఐర్లాండ్లో ఉన్న ఫేస్బుక్ ఉద్యోగి.. ఢిల్లీకి చెందిన వ్యక్తి చేస్తున్న ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీనికి ఢిల్లీ, ముంబై పోలీసులు ఎంతో శ్రమించారు. చివరకు ఆ వ్యక్తిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు.
ఆత్మహత్యకు సంకేతాలు..
క్షణక్షణం ఉత్కంఠగా సాగిన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్డౌన్ కారణంగా ఓ వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాడు. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన అతడు శనివారం రాత్రి(ఆగస్టు 8) ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆత్మహత్య చేసుకునేముందు ఫేస్బుక్లో ఇందుకు సంబంధించిన సంకేతాలను ఇస్తూ పలు పోస్టులు పెట్టాడు.
ఆ ప్రయత్నాన్ని గుర్తించిన ఐర్లాండ్ ఉద్యోగి..
కాగా, అతడు పోస్టు చేసిన వీడియోలను ఐర్లాండ్లో ఫేస్బుక్ కార్యాలయ ఉద్యోగి గమనించాడు. వెంటనే ఆ ఫేస్బుక్ ఖాతా ద్వారా అతడి ఫోన్ నెంబర్ను తెలుసుకున్నాడు. ఆ తర్వాత నేరుగా బాధితుడికి ఫోన్ చేస్తే.. అతడు వెంటనే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని భావించి.. ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించాడు.
ఐర్లాండ్ నుంచి ఢిల్లీ పోలీసులకు ఫోన్..
ఢిల్లీ డీసీపీ అన్వేశ్ రాయ్ నెంబర్ సంపాదించి ఆయనకు ఫోన్ చేశారు. యువకుడి ఆత్మహత్యాయత్నం గురించి వివరించారు. అతడి కాంటాక్ట్ నెంబర్ షేర్ చేశాడు. అప్పుడు శనివారం రాత్రి 8 గంటలు కావస్తోంది. సమాచారం తీసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు కొద్ది క్షణాల్లోనే ఆ ఇంటి చిరునామాను కనుగొన్నారు. ఆ ఇల్లు తూర్పు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి.. డీసీపీ రాయ్ వెంటనే తూర్పు మండలం డీసీపీ జగ్మీత్ సింగ్కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఢిల్లీలో భార్య.. ముంబైలో భర్త..
ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ఓ ఇంట్లోకి వెళ్లారు. అయితే, ఆ ఇంట్లో ఒక మహిళ ఉంది. ఆ ఫోన్ నెంబర్ తనదేనని చెప్పారు. ఇక ఫేస్బుక్ వీడియో పోస్టుల గురించి ప్రశ్నించగా.. తన ఫేస్బుక్ ఖాతాను తన భర్త ఉపయోగిస్తున్నారని చెప్పింది. అంతేగాక, అతడు ఢిల్లీలో లేడని ముంబైలో ఉన్నాడని తెలిపింది. అక్కడ ఓ హోటల్లో కుక్గా పనిచేస్తున్నాడని చెప్పింది. అయితే, ముంబైలో ఎక్కడుంటున్నాడో తనకు తెలియదని చెప్పిన ఆ మహిళ.. తన భర్త ఫోన్ నెంబర్ను పోలీసులకు ఇచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పోలీసులు మరో ఆపరేషన్కు సిద్ధమయ్యారు. ముంబై సైబర్ క్రైమ్ డీసీపీ రష్మీ కరాందికర్కు డీసీపీ రాయ్ ఫోన్ చేసి ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం గురించి వివరించారు. దీంతో ఫోన్ నెంబర్ ఆధారంగా గాలింపు చేపట్టారు. అయితే, అడ్రస్ దొరకలేదు. దీంతో ఢిల్లీ, ముంబై పోలీసులు సమన్వయంతో ముందుకెళ్లారు.
పోలీసుల ముందు ఒకటే లక్ష్యం...
అప్పటికే టైమ్ రాత్రి 10గంటలు దాటింది. అతడ్ని ఎలాగైనా కాపాడాలని పోలీసులంతా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ పోలీసులు.. సదరు వ్యక్తికి అతని తల్లితో వాట్సాప్ కాల్ చేయించారు. అయితే, అతడు ఫోన్ తీయలేదు. ఆ తర్వాత మళ్లీ అతని నుంచి తల్లికి ఫోన్ వచ్చింది. దీంతో అతడ్ని మాటల్లో పెట్టారు. ఓ పోలీసు అధికారి కూడా అతనితో మాట్లాడారు. ఈ క్రమంలో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి చిరునామాను పట్టేశారు పోలీసులు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
Recommended Video
ఆపరేషన్ సక్సెస్.. పోలీసులకు సెల్యూట్..
ఆ తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. ఇటీవల తనకు బిడ్డ పుట్టిందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ఈ నిర్ణయానికి వచ్చినట్లు బాధితుడు పోలీసులతో తన బాధను పంచుకున్నాడు. ఇప్పుడిక అలాంటి పొరపాటు నిర్ణయం తీసుకోనని తెలిపాడు. దీంతో ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతమైనట్లైంది. అప్పటికి రాత్రి 1.30గంటలు దాటింది. ఎక్కడో ఐర్లాండ్లో ఉన్న వ్యక్తి.. మనదేశంలోని వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించడం.. ఇక మన పోలీసులు తమ శక్తివంచనలేకుండా ప్రయత్నించడం అభినందించదగ్గ విషయమే. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై పోలీసులకు సెల్యూట్ చేయాల్సిందే.