ఆధార్ వర్చువల్ ఐడీ ఎలా రూపొందించాలి, ఎలా పని చేస్తుంది? తెలుసుకోండి
న్యూఢిల్లీ: ఆధార్ ద్వారా గోప్యతకు సంబంధించిన ఆందోళనలు తలెత్తుతున్న నేపథ్యంలో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఓ ప్రత్యామ్నాయం చూపించింది. మొత్తం 16 అంకెల బయోమెట్రిక్ సంఖ్యను ఎవరికైనా చెప్పే బదులు వర్చ్యువల్ ఐడీను ఎవరికి వారే వెబ్సైట్ ద్వారా సృష్టించుకుని, దానిని చెబితే సరిపోయేలా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వస్తుంది.
ఈ రెండు సంఖ్యలను యూఐడీఏఐ అనుసంధానం చేసుకుంటుంది. సెల్ ఫోన్ సిమ్కార్డు సహా వివిధ అవసరాల కోసం ఈ ఐడీని చెబితే సరిపోతుంది. తద్వారా ఆధార్ సంఖ్య గోప్యంగా ఉంటుంది. పేరు, చిరునామా, ఫోటో వంటి పరిమిత వివరాలే దీని ద్వారా తెలుస్తాయి. సాధారణంగా ఏ అవసరానికైనా ఇవి సరిపోతాయి. దీంతో ఆధార్ గోప్యత అతిక్రమణ జరిగే అవకాశం ఉండదని పేర్కొంది.
వర్చువల్ ఐడీ ఎలా
యూఐడీఏఐ వెబ్సైట్లోకి వెళ్లి ఒక వ్యక్తి ఎన్ని వర్చువల్ ఐడీలను అయినా క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా వ్యక్తి పేరు, ఫోటో, చిరునామా మాత్రమే కనిపిస్తాయి. అదే ఆధార్ అయితే మొత్తం వివరాలు తెలిసిపోతాయి. ఒకసారి వర్చువల్ ఐడీ సంపాదిస్తే అది నిర్దేశిత కాలం వరకు ఉంటుంది. మార్చుకోవాలని భావిస్తే పాత ఐడీ పోతుంది. ఇలా ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినా వర్చువల్ ఐడీలను పొందవచ్చు. చివరిసారిగా అతను సంపాదించిన ఐడీయే మనుగడలో ఉంటుంది. దీనికి సంబంధించి విధివిధానాలపై ఇప్పటికే అధీకృత ఆధార్ సెంటర్లకు ఆదేశాలు ఇచ్చారు.
ఒక్కొక్కరు ఎన్ని గుర్తింపులనైనా
ఒక్కొక్కరు ఎన్ని గుర్తింపులనైనా సృష్టించుకోవచ్చు. అవి పరిమిత కాలమే చెల్లుబాటవుతాయి. కొత్తది రాగానే పాతది దానంతట అదే రద్దవుతుంది. ఈ 16 అంకెల యాదృచ్ఛిక సంఖ్యను ఆమోదించడాన్ని ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి అనుమతిస్తారు. ఆధార్ సంఖ్య మాదిరిగానే ఈ సంఖ్యను వినియోగించుకోవచ్చు.
కావాల్సినంత మేరకే ఇచ్చేందుకు
వాస్తవిక గుర్తింపుతో పాటు పరిమిత కేవైసీ పద్ధతినీ యూఐడీఏఐ తీసుకు వస్తోంది. మీ వినియోగదారుని తెలుసుకో (కేవైసీ) పేరుతో బ్యాంకులు సహా అనేక సంస్థలు ఈ వివరాలను కోరుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనూ కేవలం కావాల్సినంత మేరకే వివరాలను అధీకృత సంస్థకు ఇవ్వడానికి పరిమిత కేవైసీ పద్ధతిని రూపొందించింది.
ఇటీవల ఆరోపణలు, విమర్శలు
కాగా, రూ.100 కోట్లకు పైగా భారతీయుల ఆధార్ వివరాలను తెలుసుకోగల ఓ సేవను ది ట్రిబ్యూన్ పత్రిక కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ యూఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ పట్నాయక్ ఇటీవల ఫిర్యాదు చేశారు. పత్రికకు కథనం అందించిన విలేకరి రచనా ఖైరా పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. మరోపక్క ఈ విషయాన్ని పత్రికలో రాసినందుకు రచనా ఖైరాకు అవార్డు ఇవ్వాలని అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ అన్నారు. పౌరుల గోప్యతను పరిరక్షించే విధానాన్ని భారత ప్రభుత్వం సంస్కరించాలన్నారు.