అమిత్ షా: స్టాక్ బ్రోకర్ నుంచి షెహన్షా వరకు ఎలా ఎదిగారు..?
బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోడీ కేబినెట్లో చివరి నిమిషంలో బెర్తు దక్కించుకున్నారు. ఇక మోడీ-షా ద్వయం అంతకుముందు గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో కలిసి పనిచేశారు. ఆ సమయంలో మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా అమిత్ షా ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వానీల తర్వాత బీజేపీకి అందిన జోడీ మోడీ అమిత్ షా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2014.2019 ఎన్నికల్లో బీజేపీని గెలిపించింది మోడీ-షా ద్వయం
వాజ్పేయి-అద్వానీ మ్యాజిక్ తర్వాత మోడీ-షా మ్యాజిక్ బీజేపీని ఊహించని స్థానంలో నిలబెట్టింది. 2014 మరియు 2019 సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరి చాకచక్యం, చాణక్యత కమలం పార్టీకి ఘనవిజయాన్ని అందించాయి. బీజేపీకి చాణక్యుడు అమిత్ షా అని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. బీజేపీ వ్యూహాలు వాటిని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు అమిత్ షా. రాజకీయాలు కాసేపు పక్కన బెడితే అమిత్ షా మంచి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా. ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత నెంబర్ టూ పొజిషన్లో అమిత్ షా ఉండటం విశేషం.
గాంధీనగర్లో అన్ని రికార్డులను బ్రేక్ చేసిన అమిత్ షా
ఇక 2019లో సాధారణ ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి పోటీచేసిన అమిత్ షా 5.5 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి అప్పటి వరకు అద్వానీ పేరిట ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేశారు. 2010లో షోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షా కొన్ని రోజుల పాటు జైలు జీవితం గడిపారు. అయితే గుజరాత్ను వీడి మరెక్కడైన ఉండాలంటూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఆ తర్వాత నాలుగేళ్లకు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అమిత్ షా. ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో తనదైన మార్కు వేశారు. సబర్మతి జైలు నుంచి బయటకు వచ్చిన అమిత్ షా... ఇప్పటికి మాత్రమే తను రాష్ట్రంను వీడి వెళుతున్నానని తిరిగి ఏదో ఒకరోజు వస్తానని నాడు చెప్పారు.
గుజరాత్ మంత్రిగా ఒకేసారి 12 పోర్ట్ఫోలియోలు నిర్వహించిన అమిత్ షా
1989 నుంచి ఇప్పటి వరకు అమిత్ షా 29 ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే ఒక్క ఎన్నికలో కూడా ఆయన ఓటమి చూడలేదు. గుజరాత్లోని సర్కేజ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి 1997,1998,2002,2007లో మొత్తం నాలుగుసార్లు ఎన్నికయ్యారు . ఒకానొక సమయంలో అమిత్ షా రాష్ట్రమంత్రిగా 12 పోర్ట్ఫోలియోల బాధ్యతలను నిర్వర్తించారు. వీటిలో హోమ్, లా అండ్ జస్టిస్, జైళ్లు, సరిహద్దు భద్రత, పౌర రక్షణ, ఎక్సైజ్, రవాణా, ప్రొహిబిషన్, హోమ్గార్డు, గ్రామరక్షక్ దల్, పోలీస్ హౌజింగ్, లెజిస్లేటివ్ మరియు పార్లమెంటరీ అఫెయిర్స్లాంటి పోర్ట్ఫోలియోలు నిర్వహించారు. మంచి వ్యూహకర్తగా పేరున్న అమిత్ షా మోడీతో కలిసి ఎన్నో రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు కృషి చేశారు.
అమిత్ షా నాయకత్వంలోనే చాలా రాష్ట్ర అసెంబ్లీల్లో బీజేపీ విజయం సాధించింది. 2016లో మహారాష్ట్ర, హర్యానా, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, అస్సోం రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ వికసించింది. ఆ తర్వాత ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో మాత్రం ఓటమి వెంటాడింది. ఇక ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లతో పాటు మణిపూర్లో కూడా కమలం పార్టీ గెలిచిందంటే దీని వెనక అమిత్ షా వ్యూహం ఉంది.