డాక్టర్పై రోగి బంధువుల దాడి, పుర్రె ప్రాక్చర్, ట్రీట్మెంట్ అందించకుండా వైద్యుల నిరసన
కోల్కతా : పశ్చిమబెంగాల్లో ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ మరింత ముదిరింది. అయితే సోమవారం రాత్రి మహ్మద్ సాహిద్ అనే రోగికి ఎన్ఆర్ఎస్ హాస్పిటల్లో వైద్యం చేశారు. అయితే అతను మృతిచెందడంతో రోగి బంధువుల రచ్చ రచ్చ చేశారు. వైద్యం చేసిన వైద్యులపై దాడి చేసి బీభత్సం సృష్టించారు.
రోగి చనిపోతే ..
ఆరోగ్యం బాగోలేక టాగ్రాకు చెందిన మహ్మద్ సాహిద్ అనే 75 ఏళ్ల వృద్దుడు ఎన్ఆర్ఎస్ దవాఖానలో సోమవారం చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆ రోజు రాత్రి 11 గంటలకు చనిపోయారు. సాహిద్కు సరైన వైద్యం అందించలేదని రోగి బంధువులు ఆరోపించారు. అంతేకాదు చనిపోయాక సాహిద్ మృతదేహం అప్పగించేందుకు కూడా ఆలస్యం చేశారని మండిపడ్డారు. ఆస్పత్రిలో రోగి బంధువుల బీభత్సం సృష్టించారు. దాదాపు 200 మంది ఆస్పత్రిలో దాడి చేసినట్టు సిబ్బంది తెలిపారు. వైద్యం అందించిన ఇద్దరు జూనియర్ డాక్టర్లపై దాడికి తెగబడ్డారు. అందులో పరిబహ ముఖపోధ్యాయ్ అనే జూనియర్ డాక్టర్పై వెనక నుంచి ఇటుక పెళ్లతో కొట్టడంతో ఆయన పుర్రె పగిలింది. దీంతో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు.
పగిలిన డాక్టర్ పుర్రె
వైద్యులు పరిబహను క్షుణ్ణంగా పరిశీలించారు. అతని పుర్రెకు గాయమైందని .. వైద్యం అందిస్తామని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. కానీ మెదడు అసాధారణంగా పనిచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సీటీ స్కాన్ తీసి .. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పుర్రె గాయానికి సంబంధించి చిన్న శస్త్రచికిత్స నిర్వహించామని ... ప్రస్తుతం మాత్రం ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉందని తెలియజేశారు. వైద్యులపై దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలలేనని ఆరోపించారు బీజేపీ నేత ముకుల్ రాయ్.
ఆందోళన
వైద్యులను దాడిని నిరసిస్తూ మంగళవారం ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి గేటు మూసి తమ ఆందోళన తెలియజేశారు. వైద్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని సీఎం మమతా బెనర్జీని కోరారు. ఇవాళ కూడా జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వైద్యుల ఆందోళనతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత మూడురోజలు తమ రోగికి వైద్యం అందడం లేదని .. ఆస్పత్రిలోకి వైద్యులు రానీయడం లేదని రోగి బంధువు వాపోయారు. ఆస్పత్రిలో వైద్యులే గాక అన్ని విభాగాలు నిరసన తెలియజేస్తున్నాయి. దీంతో వారితో చర్చలు జరుపుతున్నామని .. త్వరలో వారు విధుల్లో చేరుతామని టీఎంసీ పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు, టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ మాజీ తెలిపారు.