బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు: గోమాంసం, పందిమాంసం తిన్న నెహ్రూ పండిట్ ఎలా అవుతాడు..?
Recommended Video
గోమాంసం, పంది మాంసం తినేవారు పండిట్ ఎలా అవుతారు అని దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే గ్యాన్ దేవ్ అహుజా. నెహ్రూ పండిట్ కాదని చెప్పిన ఆయన ఆ పేరును కాంగ్రెస్ ఆపాదించిందని దేవ్ చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా గోమాంసం పందిమాంసం తింటారని గ్యాన్ దేవ్ అహుజా ఆరోపించారు. కులంపేరు చెప్పుకుని కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తోందని ధ్వజమెత్తారు గ్యాన్ దేవ్ అహుజా.
రాహుల్ గాంధీ ఆలయాలను దర్శించుకోవడం తన నానమ్మ ఇందిరాగాంధీ నుంచి నేర్చుకున్నారని రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలపై స్పందిచిన అల్వార్ బీజేపీ ఎమ్మెల్యే... అసలు రాహుల్ గాంధీ ఇందిరాతో కలిసి ఆలయాలకు వెళ్లారనేది అబద్ధమని చెప్పారు. ఒకవేళ వెళ్లినట్లు సచిన్ పైలట్ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అహుజా చెప్పారు. రాహుల్కు యాగ్యోపవీత్ ఎప్పుడు జరిగిందో సచిన్ పైలట్, గెహ్లాట్, గులాంనబీ ఆజాద్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జ్యందెం రాహుల్గాంధీ ఎప్పుడు ధరించారో చెప్పాలని గ్యాన్ దేవ్ సూటిగా అడిగారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఈ ఎమ్మెల్యేకు ఇది మొదటి సారి కాదు. అంతకుముందు కూడా లవ్ జిహాద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను ముస్లింలు ముగ్గులోకి దింపి వారితో లవ్ జిహాద్ పేరిట మతమార్పిడలకు పాల్పడుతున్నారని చెప్పి వివాదానికి కారణమయ్యారు.అంతేకాదు గోవును చంపడం ఉగ్రవాదంకంటే పెద్ద నేరమని చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు గ్యాన్ దేవ్. ఉగ్రవాదులు ఇద్దరినో లేక ముగ్గురినో చంపుతారని.. అదే ఒక గోవును చంపితే దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల సెంటిమెంట్లను చంపినట్లే అని చెప్పి పెద్ద దుమారమే రేపారు.
ఇదిలా ఉంటే ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఆరోపణలపై అక్బర్ అనే వ్యక్తిని చంపిన ఘటనలో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు నిందితులను వెంటనే విడదుల చేయాలని గ్యాన్ దేవ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే అక్బర్ కేసులో జైలులో ఉన్న నిందితులు గ్యాన్ దేవ్ మనుషులేనని అక్బర్ తరపున బంధువులు చెబుతున్నారు. 2016లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెక్స్ కార్యకలాపాలకు, డ్రగ్స్కు కేంద్రంగా నిలుస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు గ్యాన్ దేవ్.