తల్లి విదేశీ మహిళ... అలాంటప్పుడు రాహుల్ ప్రధాని ఎలా అవుతారు: బీఎస్పీ
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ జాతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కొంతకాలంగా కాంగ్రెస్తో సఖ్యతగా ఉంటూ వస్తున్న మాయావతి పార్టీ బీఎస్పీ కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా పార్టీ అధినేత్రి మాయావతి పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసింది బీఎస్పీ. రాహుల్ గాంధీ తల్లి సోనియాగాంధీ విదేశీయురాలైనందున రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ఎలా అవుతారంటూ ప్రశ్నించింది.
రానున్న లోక్సభ ఎన్నికలపై చర్చించేందుకు బీఎస్పీ అధినాయకత్వం భేటీ అయ్యింది. ఈ సందర్భంలోనే దేశప్రధానిగా మాయావతి ఉండాలని ఇప్పటికే సమయం మించిపోయిందని ఆ పార్టీ జాతీయ సమన్వయకర్తలు వీర్ సింగ్, జై ప్రకాష్ సింగ్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు నరేంద్ర మోడీని ఢీకొట్టగల సత్తా ఒక్క మాయావతికే ఉందని వారన్నారు.
కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి పగ్గాలు చేపట్టడంలో మాయావతి కీలకంగా వ్యవహరించి తన సత్తాను చాటారని చెప్పిన జై ప్రకాష్ సింగ్... నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయాలను ధీటుగా ఎదొర్కొనగల దమ్మున్న నాయకురాలు ఒక్క మాయావతే అని అన్నారు.
మాయావతి ఒక దళిత నేతనే కాదు ఆమెకు వివిధ సామాజిక వర్గాల మద్దతు కూడా పుష్కలంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ పేరు ప్రచారంలోకి వస్తుండటంతో బీఎస్పీ తనదైన శైలిలో స్పందించింది. రాహుల్ ముఖ పోలికలు సోనియా ముఖపోలికలతో ఉంటాయని రాజీవ్ గాంధీ పోలికలు లేవని బీఎస్పీ వ్యాఖ్యలు చేసింది.
సోనియా విదేశీయురాలు కనుక రాహుల్ దేశప్రధానిగా ఎప్పటికి కాలేరని అది ఆమోదయోగ్యం కాదని బీఎస్పీ కామెంట్ చేసింది. బీఎస్పీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించేందుకు నిరాకరించారు.