సరిహద్దు దాటి ‘అరుణాచల్’పై చైనా దుస్సాహసం
న్యూఢిల్లీ: మనదేశంలోని అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలన్న దురాశను చైనా మరోసారి బయటపెట్టుకుంది. మీడియా కథనాల ప్రకారం దాదాపు చైనాకు చెందిన 250 మంది పీఎల్ఏ సైనికులు దాదాపు మూడు గంటల పాటు భారత భూభాగంపై గడిపినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత భారతదేశ రక్షణ శాఖ వర్గాలు కూడా స్పందించాయి. సరిహద్దుల్లో అతిక్రమణ జరిగిందని అంగీకరించాయి. అయితే ఇది తాత్కాలిక ఉల్లంఘన అనిపేర్కొన్నాయి. చైనాకు తమ నిరసన తెలియజేస్తామని తెలిపాయి. ఇటువంటి చొరబాట్లు ఈ సెక్టర్లో సాధారణంగా జరగడం లేదని తెలిపాయి. కాగా, ఘటన జూన్ 9న తూర్పు కెమాంగ్ జిల్లాలో జరిగినట్లు సమాచారం.
భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు 'ఎక్స్ ఆపరేషన్ మలబార్ ప్రారంభమవడానికి ముందు, అణు సరఫరాదారుల కూటమి(ఎన్ఎస్జి)లో భారతదేశం చేరిక కోసం వియన్నాలో చర్చలు జరుగుతున్న సమయంలోనే చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్లోకి చొచ్చుకొచ్చింది. చైనా దుస్సాహసాన్ని అమెరికా రక్షణ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
భారత్ తోపాటు పాకిస్థాన్ కూడా ఎన్ఎస్జీలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. అయితే, ఇండియా ఆ గ్రూప్లో చేరడం ఇష్టంలేని చైనా.. ఎలాగైనా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతూనే ఉంది. మెక్సికో, ఇటలీ, స్విట్జర్లాండ్, అమెరికా, జపాన్, తదితర దేశాలు భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్నాయి. పాకిస్థాన్కు చైనా మద్దతు పలుకుతోంది
అమెరికా కాంగ్రెస్కు పెంటగాన్ సమర్పించిన నివేదికలో అరుణాచల్ ప్రదేశ్ గుండా 4,057 కి.మీ. పొడవున ఉన్న భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
అనంతరం అమెరికా రక్షణ శాఖ ఉప సహాయ కార్యదర్శి (తూర్పు ఆసియా) అబ్రహాం డెన్మార్క్ మాట్లాడుతూ.. భారతదేశానికి సరిహద్దుల్లో చైనా సైన్యం సంచరించడం గమనించామన్నారు. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో భాగమని, అందువల్ల అది చైనాకే చెందుతుందని చైనా చెప్పుకొస్తోంది. కాగా, చైనా కబంద హస్తాల నుంచి విముక్తి కోసం ఎన్నో ఏళ్లుగా టిబెటన్లు పోరాడుతున్న విషయం తెలిసిందే.