ట్రిపుల్ తలాక్ నెంబర్ గేమ్: టీడీపీ వైసీపీ బీజేపీ...ఎవరికి తలాక్..ఎవరితో ములాఖత్..?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక ఉభయసభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో ఇక రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ తమ తొలి హయాంలో బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో ఆమోదం పొందింది కానీ ... రాజ్యసభలో మాత్రం సంఖ్యాబలం లేకపోవడంతో పాస్ చేయలేకపోయింది. దీంతో ఆర్డినెన్స్ రూపంలో బిల్లును తీసుకురావడం జరిగింది. ఇక మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ చేసేందుకు కూడా బీజేపీ కష్టపడాల్సి వచ్చింది. మర సభలో బిల్లును పాస్ చేసేందుకు బీజేపీకి కలిసొచ్చిన అంశాలేంటి..?
రాజ్యసభలో పాస్ అయిన ట్రిపుల్ తలాక్ బిల్లు
చరిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో పాస్ అయ్యింది. అయితే సొంతంగా పాస్ చేసేంత సంఖ్యాబలం ఎన్డీఏకు లేకపోయినప్పటికీ కొన్ని పార్టీలు ఓటింగ్లో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయి బీజేపీకి సహకరించాయి. బీజేపీ కూడా ఇదే ఆశించింది. సభలో ఎలాగైనా సరే బిల్లు పాస్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే కమలం పార్టీ చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇక ఓటింగ్లో పాల్గొనకుండా తెలుగు రాష్ట్రాల పార్టీలు బీజేపీకి పరోక్షంగా సహకరించినట్లు తెలుస్తోంది.
సభలో ఓటింగ్కు ముందు ఈక్వేషన్స్
ప్రస్తుతం రాజ్యసభలో మూడు స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. ఈ మూడు సీట్లు మినహాయిస్తే పెద్దల సభలో 242 మంది ఎంపీలున్నారు. ఇక టీఆర్ఎస్ , బీజేపీ మిత్రపక్షం జేడీయూలు ఓటింగ్కు గైర్హాజరయ్యారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 236కు చేరుకుంది. ఇక 14 మంది సభ్యులు వివిధ ఆరోగ్యసమస్యలతో సభకు హాజరుకాలేదు. దీంతో రాజ్యసభలో సభ్యుల సంఖ్య 216కు చేరింది. ఇక సభలో బిల్లు పాస్ కావాలంటే ఎన్డీఏకు 109 మంది సభ్యుల మద్దతు కావాలి. చివరి నిమిషంలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదల్ పార్టీ మద్దతు ఇవ్వడంతో 113 మంది ఎంపీల మద్దతు ఉంటుందని బీజేపీ భావించింది.
టీడీపీని ఫిక్స్ చేయాలని భావించిన వైసీపీ
ఇక వైసీపీ, టీడీపీలు సభలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. వైసీపీ బీజేపీతో సఖ్యతతో వ్యవహరిస్తోందనే వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం జరిగిన ఓటింగ్లో వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా టీడీపీని ఫిక్స్ చేయాలని భావించినట్లు సమాచారం. అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి తాము ఎలా మద్దతు ఇస్తామని తెలియజేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు బిల్లుకు మద్దతు ఇచ్చి రాష్ట్రంలో ముస్లింలను దూరం చేసుకోవడం ఇష్టం లేకే ఇలా వ్యతిరేక ఓటు వేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు.
బీజేపీకి పరోక్షంగా టీడీపీ సహకరించిందా..?
ఇక ఓటింగ్లో టీడీపీ పాల్గొనకుండా బయటకు వెళ్లి పరోక్షంగా బీజేపీ విజయానికి సహకరించింది. ముస్లింలను దూరం చేసుకోవడం ఇష్టం లేకే టీడీపీ బయటకు వెళ్లిందని చెప్పుకునే అవకాశం ఉంది. అయితే నెంబర్ గేమ్లో బయటకు వెళ్లడం ద్వారా పరోక్షంగా బిల్లు ఆమోదంకు సహకరించినట్లే. బీజేపీతో సంబంధాల పునరుద్ధరణలో భాగంగా ఇది తొలి అడుగుగా అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. మరోవైపు 11 మంది సభ్యులున్న అన్నాడీఎంకే కూడా సభ నుంచి వాకౌట్ చేసి బీజేపీ విజయానికి కృషి చేసినట్లు స్పష్టమవుతోంది.