ఆవేదన: తండ్రి కోరిక నెరవేర్చలేకపోయిన సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్కు సీఈఓ కొనసాగుతూ ఏడాదికి సుమారు 335 కోట్ల రూపాయల గౌరవ వేతనం పొందుతున్న సుందర్ పిచాయికి ఒక అసంతృప్తి మిగిలిపోయింది. జీవితంలో ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్న ఆయన తన తండ్రి కోరిక మాత్రం తీర్చలేకపోయారట.
తాను పీహెచ్డీ పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్నది తన తండ్రి కల అని సుందర్ పిచాయ్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన తండ్రి డిగ్రీతోనే ఆపేయాల్సి వచ్చిందని సుందర్ తెలిపారు. అందువల్ల తనను పీహెచ్డీ చేయాలని కోరేవాడని చెప్పారు.
తన తండ్రి కలను తాను నెరవేర్చాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. కానీ పీహెచ్డీ పూర్తి చేయలేకపోయానని సుందర్ తెలిపారు. ఎంఎస్ చేసిన తర్వాత ఉద్యోగంలో చేరడం వల్ల తన తండ్రి కలను నెరవేర్చలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తన కోసం తన తల్లిదండ్రులు, సోదరుడు చాలా త్యాగాలు చేశారని గుర్తు చేసుకున్నారు. తాను చదువుకోవడమే వారి కోరిక అని తెలిపారు. కాగా, సుందర్ ఖరగ్పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో ఉన్నత చదువులు చదివి క్రమ క్రమంగా ఎదుగుతూ గూగుల్ సంస్థకు సీఈఓగా నియమితులయ్యారు.