హేమంత్ సోరెన్ ఎలా గెలిచాడో తెలుసా? రెండో సారి సీఎం కాబోతున్నఈ యువనేత గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో
హేమంత్ సోరెన్.. కొన్ని గంటలుగా మారుమోగుతున్న పేరిది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని అన్నీ తానై నడిపించే ఈ యువనేతనే.. కాబోయే సీఎం అంటూ కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. సోమవారం విడుదలైన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కూటమి మెజార్టీ మార్కును సాధించింది. బలమైన బీజేపీని ఢీకొట్టిమరీ సాధించిన ఈ విజయం.. గాలివాటంగా వచ్చిందికాదు.
who is Jharkhand next cm: హేమంత్ సోరెన్కే ప్రజల పట్టం, 29 శాతం ఓట్లు అని సర్వే...
మలుపు తిప్పిన ‘భూమి హక్కుల‘ పోరాటం
జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఘనవిజయం సాధించడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి.. హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో సాగిన భూపోరాటాలు. మన దేశంలోని ఖనిజ సంపదలో 45 శాతం తనలోనే దాచుకున్న జార్ఖండ్ లో మెజార్టీ జనాభా గిరిజనులే. దీంతో అక్కడ గిరిజనుల హక్కుల్ని కాపాడుకోవడం ప్రధానాంశంగా ఉంది. ప్రతి పనిలో గిరిజనుల ప్రయోజనాలను పరిశీలించడం ముఖ్యమైన అంశంగా అన్ని పార్టీలు భావిస్తాయి.
హేమంత్ సారధ్యంలో రోడ్డెక్కిన జనం..
పెద్ద కులాలు, పెద్ద కంపెనీల చేతిల్లో అమాయక గిరిజనులు మోసపోకుండా ఉండేలా భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై గట్టి జార్ఖండ్ లో చట్టాలున్నాయి. అందులో ‘చోటా నాగ్ పూర్ టెనెన్సీ యాక్ట్‘, ‘సంతాల్ పర్గణా టెనెన్సీ యాక్ట్' అతి ముఖ్యమైనవి. 2016లో రఘుబర్ దాస్ ప్రభుత్వం.. ఈ రెండు చట్టాల్లో సవరణలు తేవాలని ప్రయత్నించింది. ఆ సవరణలతో ప్రభుత్వ, ప్రైవేటు డెవలప్మెంట్ పనుల కోసం గిరిజనుల భూముల్ని ఇతరులు తీసుకునే వీలు ఏర్పడింది. దీనిపై స్థానికుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. చట్టాల్లో మార్పులు చేస్తే గిరిజనుల బతుకులు ఆగమైపోతాయంటూ హేమంత్ నిరసించారు. క్రమంగా భూమి హక్కుల పోరాటం పెద్ద ఉద్యమంగా మారింది. హేమంత్ పిలుపుతో లక్షలాది మంది గిరిజనులు రోడ్లెక్కి నిరసనలు చేపట్టారు. జార్ఖండ్ లో దాదాపు ఏడాదిన్నర పాటు రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరిగాయి.
అందుకే ఆయనను ప్రకటించారు..
ఎన్నో విలువైన ఖనిజాలకు నిలయంగా ఉన్న జార్ఖండ్ లో భూచట్టాలను మార్చడం ద్వారా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు గేట్లు తెరిచిందన్న హేమంత్ వాదనను ప్రజలు నమ్మారనడానికి నిదర్శనమే.. ఇవాళ్టి ఎన్నికల ఫలితాలు. గడిచిన ఐదేండ్లలో హేమంత్ పోరాడిన తీరును అందరూ గమనించారు. కాబట్టే కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు రెండో మాట లేకుండా హేమంత్ సోరెన్ ను సీఎం క్యాండేట్ గా ప్రకటించేశాయి.
సీఎం పీఠంపై రెండోసారి..
హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పీఠాన్ని ఎక్కడం ఇది రెండోసారి. 2013లో రాష్ట్రపతి పాలన అనంతరం తొలిసారి సీఎం అయిన హేమంత్.. కేవలం ఆరు నెలలు మాత్రమే పదవిలో కొనసాగారు. 2013 జులై 13 నుంచి 2014 డిసెంబర్ 28 దాకా సీఎంవోలో ఉన్నారు. ఈసారి స్పష్టమైన మెజార్టీ రావడం, కూటమి పార్టీల మధ్య స్నేహం గతంలో కంటే పెరగడం, అన్నింటికీ మించి.. బీజేపీని నిలువరించాలనుకునే వ్యక్తులందరూ హేమంత్ కు అండగా నిలబడే పరిస్థితులు ఏర్పడటంతో రెండో టర్మ్ లో పూర్తిగా ఐదేండ్లూ ఆయన సీఎం సీటులో కూర్చుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
పర్సనల్ లైఫ్..
ప్రస్తుతం హేమంత్ సోరెన్ కు 44 ఏండ్లు. 1975, ఆగస్టు 10 బర్త్ డే. హేమంత్ కు భార్య కల్పనా సోరెన్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆదివాసీ పోరాట యోధుడు బిర్సా ముండాను దేవుడిలా ఆరాధిస్తారు. జార్ఖండ్ లో ప్రజలు శిబు సోరెన్ ను ‘గురూజీ'అని సంబోధిస్తారు. అదే హేమంత్ ను మాత్రం సరదాగా ‘చోటా గురూజీ'గా పిలుచుకుంటారు.