రెవిన్యూ లాస్ : రైల్వే టికెట్ ధరలు పెరుగుతున్నాయి... అందుకే..!
భారతీయ రైల్వేలకు లాభాలు కావాలి .. అందులో అనుమానం లేదు. ఈ లాభాలు రావాలంటే ఏమి చేయాలి..? టికెట్ ధరలు పెంచాలా.. ఇలా పెంచితే ప్రయాణికులు దూరం అవుతారు. అందుకే సరికొత్త పద్ధతిని అవలంబిస్తోంది రైల్వే. ఇక ధరలు అప్పటి వరకున్న టికెట్ల అమ్మకాలను బట్టి పెరుగుతూ వచ్చే స్కీమ్ను రైల్వే శాఖ ప్రారంభించింది. 2016లో ఈ స్కీమును తీసుకొచ్చింది. మొత్తం 142 ట్రైన్స్లో ఈ సదుపాయం కల్పించింది. ప్రతి 10శాతం సీట్ల అమ్మకాలు పెరుగుతుంటే టికెట్ ధర 10శాతం పెరుగుతూ వస్తుంది.అన్ని ప్రయాణ తరగతులకు ప్రవేశపెట్టింది ఒక్క ఏసీ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్కు తప్ప. ఇదే డైనమిక్ ప్రైసింగ్ ఇంకా అమల్లో ఉంది.
సర్జ్ ప్రైసింగ్ విధానం మంచిదే అన్న రైల్వే శాఖ మంత్రి
భారతీయ రైల్వే 8.4 బిలియన్ ప్రయాణికులను ఏటా వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఇందులో 140 మిలియన్ ప్రయాణికులు అప్పటికప్పుడు పెరిగిన ధరలు ప్రకారంగా టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించగలిగే స్తోమత ఉంది. అంతేకాదు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, మాజీ మంత్రి సురేష్ ప్రభులు కూడా ఇలాంటి స్కీము చాలా మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ డబ్బును కట్టి ప్రయాణించే స్తోమత ఎవరికైతే లేదో అలాంటి వారికోసం ఇతర రైళ్లు ఉన్నాయని గోయల్ తెలిపారు. సర్జ్ ప్రైస్గా పిలువబడే ఈ స్కీము రైల్వేల్లో ప్రవేశపెట్టక ముందే విమానాల్లో, హోటల్ బుకింగ్స్, ట్యాక్సీలలో ఉన్నవేనని గుర్తు చేసిన రైల్వేశాఖ... రైల్వేల్లో సర్జ్ ప్రైసింగ్ ప్రవేశపెట్టగానే చర్చ జరగుతోంది ఎందుకని ప్రశ్నించింది.
డిమాండ్ లేని సమయాల్లో టికెట్ ధరలు ఎందుకు తగ్గవు..?
పండగ సమయాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున టికెట్ ధరలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పిన రైల్వే శాఖ ... డిమాండ్ తక్కువగా లేదా అస్సలు లేని సమయంలో టికెట్ ధరలు తగ్గించాలన్న విషయాన్ని విస్మరించింది. ప్రస్తుతం ఈ ధరలపై రైల్వే బోర్డులోనే విబేధాలు తలెత్తాయి. ఈ నిర్ణయం మంచిదేనని సగం బోర్డు సభ్యులు మద్దతు తెలుపుతుండగా... మరో సగం మంది నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైల్వే టికెట్లు అనేది రాజకీయ పరమైన అంశమని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఎందుకంటే తక్కువ ధరకే ప్రయాణికులను కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానాలకు చేరుస్తునాయన్నారు.
11 నెలల్లో 7 లక్షల మంది ప్రయాణికులు దూరం
ఇక సర్జ్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టాక రైల్వేలు కేవలం 11 నెలల్లో 7 లక్షల మంది ప్రయాణికులను దూరం చేసుకుందని దీంతో ఈ స్కీము ద్వారా రైల్వే ఖజానాకు రూ.552 కోట్లు రెవిన్యూ వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రైసింగ్ విధానం మంచిది కాదని ...దీనిపై పునఃసమీక్షించాల్సిందిగా పార్లమెంటు రైల్వేశాఖను కోరాలని కాగ్ ఆగష్టులో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ప్రయాణికులు రైల్వేలకు దూరం కావడం ఒక్కింత ఆందోళనకు గురిచేసింది. దీంతో రైల్వే శాఖ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. సర్జ్ ప్రైసింగ్ పై నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది.
ధరలపై సూచనలు చేసిన 6గురు సభ్యుల కమిటీ
తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే రైళ్లపై టికెట్ ధరలు ఎక్కువగా వసూలు చేయాలని కమిటీ సూచించింది. అంతేకాదు రాత్రి సమయాల్లో ప్రయాణించే రైళ్లలో ప్రీమియం ఛార్జీలు తగ్గించడంతో పాటు ఏ అర్థరాత్రి అపరాత్రి వేళల్లో గమ్యస్థానాలకు చేరే రైళ్లలో ప్రయాణించే వారికి డిస్కౌంట్లు ఇస్తే బాగుంటుందని సూచించింది. ప్రయాణికులు కోరిన బెర్త్లను కేటాయించేందుకు ఒకరకమైన ధరను ఫిక్స్ చేయాలని చెప్పిన కమిటీ... పండగల సమయంలో టికెట్ ధరలను పెంచాలని సూచించింది.
టికెట్ బేస్ ధరను పెంచి సబ్సీడీ కట్ చేయాలి: నిపుణులు
ఇక పెట్రోలు, విద్యుత్లపై ప్రభుత్వం సబ్సీడీని తగ్గించి రెవిన్యూ రాబట్టిందని చెప్పారు అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు. ఇలానే రైల్వేల్లో కూడా టికెట్ బేస్ ధరను పెంచి సబ్సీడీని తగ్గించి రైల్వేలకు రెవిన్యే తీసుకురావచ్చని చెప్పారు. విమాన ధరలకంటే కూడా రైలు ధరలు అప్పటికి కూడా తక్కువగానే ఉంటాయని చెప్పారు. కాగ్ నివేదికను పరిగణలోకి తీసుకున్న రైల్వేలు 15 రైళ్లకు సర్జ్ ప్రైసింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో శతాబ్ది రైళ్లలో ప్రయాణించే వారికి మాత్రమే కలిసొస్తుంది. పంజాబ్, హర్యానా, చండీఘడ్, హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీలకు వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో మాత్రమే ధరలు తగ్గుతాయి. ఇక చెన్నై మదురై దురంతో, గౌహతి దిబ్రుగర్, హౌరా పూరి శతాబ్ది రైళ్లలో కూడా ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మిగతావారికి సర్జ్ ప్రైసింగ్ విధానం అలానే కొనసాగుతుంది.