ఉగ్రవాది 20 సార్లు ఎస్కేప్, భార్య కోసం వచ్చి బలి అయ్యాడు, వీడు సామాన్యుడు కాదు !
లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది అబు దుజనా అతని భార్య కోసం వచ్చి ఎన్ కౌంటర్ లో అంతం అయ్యాడని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీసు అధికారి ఎస్ పి. వాయిద్ చెప్పారు. అబు దుజనాతో పాటు మరో ఉగ్రవాది ఆరీఫ్ లిహారి కూ
శ్రీనగర్: లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది అబు దుజనా అతని భార్య కోసం వచ్చి ఎన్ కౌంటర్ లో అంతం అయ్యాడని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీసు అధికారి ఎస్ పి. వాయిద్ చెప్పారు. అబు దుజనాతో పాటు మరో ఉగ్రవాది ఆరీఫ్ లిహారి కూడ ఎన్ కౌంటర్ లో మరణించాడని ఆయన దృవీకరించారు.
ఇప్పటి వరకూ 20 సార్లు భారత సైనికులు, స్థానిక పోలీసులకు చిక్కకుండా అబు దుజనా తప్పించుకున్నాడు. అయితే రెండు సార్లు పోలీసులు అతను తప్పించుకుంటున్న సమయంలో ఎన్ కౌంటర్ చెయ్యాలని ప్రయత్నించినా అది కుదరలేదు. అబు దుజనా తన భార్య కోసం వస్తాడని పోలీసులు పసిగట్టారు.
సోమవారం అర్దరాత్రి అబు దుజనా తన భార్యను కలవడానికి పుల్వామా జిల్లాలోని హక్రిపోరా ప్రాంతంలోకి తన సహచరుడు ఆరీఫ్ లిహారీతో కలిసి వచ్చాడు. ఇద్దరు ఉగ్రవాదులు ఇంటిలోకి వెళ్లిన వెంటనే సైనికులు, పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.
మంగళవారం వేకువ జామున 4.30 గంటల వరకు ఉగ్రవాదులు బయటకు వస్తారని వేచి చూశారు. అయితే అబు దుజనా, ఆరీఫ్ లిహారీ బయటకు రాకపోవడంతో తాము ఇంటిలో చొరబడి ఉగ్రవాదులను అంతం చేశామని అధికారులు తెలిపారు.
పాక్ అక్రమిత కాశ్మీర్ కు చెందిన అబు దుజనా దక్షిణ కాశ్మీర్ లో జరిగిన అనేక దాడుల ప్రధాన సూత్రదారి అని అధికారులు అంటున్నారు. అబు దుజనా ఎన్ కౌంటర్ తో ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారని పసిగట్టిన పోలీసులు స్థానికంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.