వీడియోలో జయలలిత ఓకే, ఎలా జరిగింది, చిల్లర రాజకీయాలు, స్టాలిన్ సూటి ప్రశ్న !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇప్పుడు మరింత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. వెట్రివేల్ విడుదల చేసిన వీడియో నిజమైతే జయలలిత ఎలా మరణించారు ? అని ఎంకే స్టాలిన్ టీటీవీ దినకరన్ వర్గాన్ని సూటిగా ప్రశ్నించారు.
జయలలితకు అపోలో ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో తీసిన వీడిమో విడుదల అయిన సందర్బంగా ఎంకే. స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. టీవీవీ దినకరన్ వర్గం విడుదల చేసిన వీడియోలో జయలలిత జ్యూస్ తాగుతున్నారని స్టాలిన్ గుర్తు చేశారు.
అయితే వీడియోలో ఆరోగ్యంగా కనపడుతున్న జయలలిత తరువాత ఎలా చనిపోయారు ? అని ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా టీటీవీ దినకరన్ వర్గం నీచంగా చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఇలాంటి వాటిని ప్రజలు క్షమించరని ఎంకే స్టాలిన్ చెప్పారు.
పోలింగ్ కు ఒక్క రోజు ముందు వీడియో విడుదల చేసిన టీటీవీ దినకరన్, ఆయన వర్గీయుల మీద ఎన్నికల కమిషన్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా టీటీవీ దినకరన్ ను అనర్హుడిని చెయ్యాలని ఆ నియోజక వర్గంలో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.