యెడ్డీ ఎఫెక్ట్: విపక్షాలను ఏకం చేసిన కర్ణాటక పరిణామాలు
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలు దేశంలోని బిజెపియేతరపక్షాలను ఏకం చేశాయి. దక్షిణ భారత దేశంలో బిజెపికి పునాదిని ఏర్పాటు చేసుకోవాలని బిజెపి భావించింది. కానీ, బిజెపియేతర పార్టీలు బిజెపిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నం కర్ణాటకలో విజయం సాధించింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడ వ్యూహత్మకంగానే వ్యవహరించింది. దీంతో కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటైనా మూడు రోజుల్లోనే సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది.
దక్షిణ భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి భావించింది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రంలో మే 12వ తేదిన జరిగిన ఎన్నికల్లో బిజెపికి 104 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి 78 సీట్లు, జెడి(ఎస్)కు 38 సీట్లు, ఇద్దరు స్వతంత్రులు విజయం సాధించారు. అయితే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు సుమారు 111 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంది.
అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా వ్యవహరించింది.కర్ణాటకలో బిజెపి అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు జెడి(ఎస్)కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫ్ చేసింది. ఈ ఆఫర్ కు జెడి(ఎస్) అంగీకరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ప్రాంతీయ పార్టీలకు చెందిన కొందరు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతో పాటు, జెడి(ఎస్)తో పోన్లో చర్చించారని సమాచారం.
ఈ తరుణంలో కాంగ్రెస్, జెడి(ఎస్) పార్టీలకు బిజెపి కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ వాజ్ భాయ్ వాలా నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, జెడి(ఎస్)లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ కోర్టు ఆదేశం మేరకు మే 19వ తేదిన విశ్వాస పరీక్షకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమి ప్రభుత్వ ఏర్పాటు చేయకుండా బిజెపి రాజ్యాంగబద్దంగా ఉన్న పదవులను దుర్వినియోగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ఆరోపించారు. అయితే కర్ణాటక విషయంలో ప్రాంతీయ పార్టీల మద్దతును కూడగట్టేందుకు జెడి(ఎస్) అధినేత హెచ్ డి దేవేగౌడ ప్రయత్నించారు. ప్రాంతీయ పార్టీల అధినేతలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దేవేగౌడ చర్చించారు.