ఫలించిన కేజ్రీవాల్ మంత్రం: CBSE 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లు ప్రదర్శన అదుర్స్..!
ఢిల్లీ: ఢిల్లీలో ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతామని 2015 ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఈ హామీని ప్రజలు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం ఎవరి తరం కాదనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. కానీ ఐదేళ్ల తర్వాత నిన్న విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలతో మరోసారి దేశం మొత్తం ఢిల్లీ వైపు చూసింది. విద్యాబోధనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేజ్రీవాల్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 98శాతం ఉత్తీర్ణత నమోదు చేశారని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి రికార్డు నమోదు కాలేదని సీఎం కేజ్రీవాల్ గర్వంగా చెప్పారు. తనతో పాటు ఈ సంస్కరణలు తీసుకురావడంలో సహకరించిన తన బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
Feeling v proud to announce that the CBSE class 12 result of Delhi govt schools this year is 98% - highest ever so far. Its historic.
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 13, 2020
Congratulations to my Team Education, all students, teachers, parents and education officers.
Proud of you all.
దేశం మొత్తం కరోనావైరస్తో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. గత ఐదేళ్లుగా తమ రికార్డులను తామే బ్రేక్ చేసేలా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని కొనియాడారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా. గత ఐదేళ్లలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డు అయిన ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది. 2020లో 98శాతం రాగా, 2019లో 94.24శాతం, 2018 90.6శాతం, 2017లో 88.2శాతం 2016లో 85.9శాతం. అయితే అరవింద్ కేజ్రీవాల్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశంలోనే ఎందుకింత అత్యుత్తమమైనది అనే ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. దానికి కారణాలు ఇవే..
1. విద్య కోసం అధిక బడ్జెట్ కేటాయించడం: ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో 25శాతం విద్యకు కేటాయించడం. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్న తొలి రాష్ట్రం ఢిల్లీ
2. ఆరేళ్లలో తరగతి గదులు రెట్టింపు: ఆరేళ్ల క్రితం ఢిల్లీ స్కూళ్లలో 17వేలుగా ఉన్న తరగతి గదులు రెట్టింపు అయి 37వేలకు చేరుకున్నాయి
3. ప్రపంచస్థాయిలో ఇన్ఫ్రా: అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్విమ్మింగ్ పూల్స్, ఆడిటోరియం,ల్యాబులు, లైబ్రరీలతో మంచి వాతావరణం. పిల్లలు ఇష్టపడే వాతావరణం కల్పించడం
4. టీచర్లకు కేంబ్రిడ్జి, సింగపూర్, ఫిన్లాండ్లలో శిక్షణ: ఢిల్లీ స్కూల్స్లో పనిచేసే టీచర్లకు ప్రపంచస్థాయి ఇన్స్టిట్యూషన్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం. ఆ తర్వాత భారత్లో విద్యార్థులకు బోధించడం
5. విద్యార్థులతో నేరుగా నాయకులు మాట్లాడటం: స్కూలు విద్యార్థులతో, టీచర్లతో, తల్లిదండ్రులతో సీఎం కేజ్రీవాల్ నేరుగా మాట్లాడతారు. ఇలా చేయడం వల్ల వారిలో ఒక భరోసా కల్పించినట్లు అవుతుంది. గతేడాది ఓ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్కు సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా తరచూ స్కూళ్లను సందర్శిస్తూ పర్యవేక్షిస్తుంటారు
6. నిపుణుల సలహాలు: ఆక్స్ఫర్డ్లో విద్యనభ్యసించిన ఆప్ ఎమ్మెల్యే అతిషీ సలహాలు, ఎడ్యుకేషన్ టీమ్ల కృషితో సంస్కరణలు తీసుకురావడం. ఇతర ఎన్జీఓలు, ఇతర మోడల్ స్కూళ్లు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుని వాటిని ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేయడం
7.మెగా పేరెంట్ టీచర్ మీటింగ్: చదువులో తమ పిల్లల ప్రదర్శన పట్ల తల్లిదండ్రులకు కూడా బాధ్యతను అప్పగించడం. ప్రైవేట్ స్కూళ్లలోలా టీచర్-పేరెంట్స్ ఇంటరాక్షన్ కోసం తరచూ సమావేశాలు నిర్వహించడం ఒక్క ఢిల్లీ గవర్నమెంట్ స్కూళ్లలోనే జరుగుతుంది.
8. ఎస్టేట్ మేనేజర్లుగా మాజీ ఆర్మీ అధికారులు : పెద్ద ప్రైవేట్ స్కూళ్ల నిర్వహణకు ఎలా అయితే మాజీ ఆర్మీ అధికారులు ఉన్నారో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలకు కూడా మాజీ ఆర్మీ అధికారులను నియమించారు సీఎం కేజ్రీవాల్. స్కూలు ప్రిన్సిపాల్ అకాడెమిక్స్ వరకే పరిమితం కానుండగా.. మాజీ ఆర్మీ అధికారులు ఇతరత్ర విషయాలను చూసుకుంటారు.
9.వైవిధ్యమైన బోధన: ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు ఉంటాయి. విద్యార్థుల్లో నైపుణ్యతను పెంచేందుకు ఇవి ఉపయోగపడుతాయి. ఉదాహరణకు మిషన్ చునాతీ మిషన్ బునియాద్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి బాలుడు బాలిక చదవడం రాయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు చాలా వరకు బోధనా పరమైన అంశాలను అలవర్చుకోవడం జరిగింది.
10. సాంకేతికతను జోడించడం: పిల్లలకు బోధన చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లంతా మొబైల్ టాబ్లెట్లను వినియోగిస్తున్నారు. పై స్థాయి తరగతులకు ప్రొజెక్టర్ల ద్వారా బోధన చేయడం జరుగుతోంది. తద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం జరుగుతోంది. అలానే విద్యార్థికి మంచి విజ్ఞానం అందించడం జరుగుతోంది.
మొత్తానికి పైన ఉన్న ఈ 10 అంశాలను కచ్చితంగా అమలు చేయడంతోనే ఈసారి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు 98శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం జరిగిందని కేజ్రీవాల్ చెప్పారు.