జాదవ్ తల్లి సమయస్ఫూర్తి... చిత్తయిన పాకిస్తాన్ వ్యూహం, ఆ వీడియో వేస్టేనా!?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెరలో మగ్గుతున్న కుల్భూషణ్జాదవ్ తల్లి సమయస్ఫూర్తితో పాకిస్తాన్ వ్యూహం చిత్తయింది. ఇటీవల జాదవ్ను అతడి తల్లి అవంతి, భార్య చేతన పాకిస్తాన్లో కలిసి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆగని పాక్ ఆగడాలు, గాల్లో కలిసిపోతున్న జవాన్ల ప్రాణాలు..'సర్జికల్ స్ట్రయిక్స్' వల్ల ఒరిగిందేమిటి?
తన తల్లి, భార్యతో కుల్భూషణ్ జాదవ్ ఏం మాట్లాడాలో పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు ముందుగానే నిర్ణయించారు. ప్లాన్ ప్రకారం.. వీరి మధ్య జరిగిన సంభాషణ వీడియోను కూడా రిలీజ్ చేయాలని భావించారు. కానీ పాక్ పథకం బెడిసికొట్టింది.
తల్లికి అనుమతి ఇవ్వని పాక్...
పాకిస్తాన్ న్యాయస్థానంలో మరణశిక్ష పడి, అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో అమలు కాకుండా పాకిస్తాన్ జైలులో మగ్గిపోతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ చివరి కోరికను మానవత్వంతో మన్నించినట్లుగా ప్రచారం చేసుకున్న పాకిస్తాన్ నిజానికి తొలుత అతడ్ని కలిసేందుకు అతడి భార్య చేతనకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
భారత్ ఒత్తిడితో తల్లికి కూడా
అయితే ఇందుకు భారత్ ఒప్పుకోలేదు. అతడి తల్లి అవంతికి కూడా అతడ్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. భారత్ అభ్యర్థనల్ని అనేకసార్లు తోసిపుచ్చిన పాక్.. ఎట్టకేలకు జాదవ్ భార్యకు మాత్రమే వీసా మంజూరు చేసింది. అయితే పాకిస్తాన్పై మన దేశం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇష్టంలేకపోయినా గత్యంతరం లేక పాకిస్తాన్ ఇందుకు అంగీకరించి అనుమతి ఇచ్చింది. అయితే పాకిస్తాన్పై ఇలా ఒత్తిడి తేవడం కూడా మన దేశానికే కలిసొచ్చింది.
పాకిస్తాన్ ప్లాన్ ఏమిటంటే...
కుల్భూషణ్ జాదవ్ను అతడి తల్లి, భార్య కలిసే వ్యవహారంలో పాకిస్తాన్ ముందుగానే పకడ్బందీ ప్లాన్ వేసింది. వారి మధ్య జరిగిన సంభాషణ వీడియోను రికార్డు చేసి దాన్ని విడుదల చేయాలనేది పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్. ఆ వీడియోలో..‘తాను నేరస్థుడినంటూ..' కుల్భూషణ్ చేతే చెప్పించేలా ప్రణాళికలు రచించింది. అతడిచేత అలా చెప్పించడం కోసం చాలారోజులుగా అతడిని చిత్రహింసలు పెట్టి ఉంటుందని కూడా భారత్ అనుమానిస్తుంది.
సమయస్ఫూర్తి ప్రదర్శించిన జాదవ్ తల్లి...
22 నెలల తర్వాత జాదవ్ తల్లి, భార్య డిసెంబర్ 25న అతడ్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో కలిశారు. అయితే జాదవ్ మొహంలో భార్యను, తల్లిని చూసిన ఆనందం కనిపించలేదు. పాకిస్తాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ చెప్పిన విధంగానే జాదవ్ వారితో మాట్లాడాడు. ‘నేను పాకిస్తాన్లో అనేక బాంబు దాడులకు సూత్రధారిని..' అని జాదవ్ అనగానే అతడి తల్లి అవంతి శత్రు దేశం వ్యూహాన్ని పసిట్టేసింది. ‘ఇప్పుడు నువ్వెందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నావ్. ఇరాన్లో వ్యాపారం చేస్తున్న నిన్ను పాకిస్తాన్ సైన్యం ఎత్తుకొచ్చింది కదా. నువ్వు నిజం చెప్పాలి..' అంటూ కొడుకు మీద కోప్పడింది.
ఫలించని పాక్ వ్యూహం...
తాము చెప్పినట్లుగానే కుల్భూషణ్ జాదవ్ మాట్లాడినప్పటికీ.. అతడి తల్లి మధ్యలో కల్పించుకుని పాకిస్తాన్నే దోషిగా నిలబెట్టే యత్నం చేయడంతో పాక్ వ్యూహం చిత్తయింది. నిజానికి ‘నేను పాకిస్తాన్లో అనేక బాంబు దాడులకు సూత్రధారిని..' అని జాదవ్ అన్న మాటలు ఉన్న ఆ వీడియోను విడుదల చేసి భారత్ను ఇరుకున పెట్టాలని పాకిస్తాన్ భావించింది. కానీ అందులో అతడి తల్లి మాటలు ఉండడం, అవి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉండడంతో ఏం చేయలేకపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ చేయగలిగింది ఒక్కటే.. ఆ వీడియోలో జాదవ్ తల్లి మాటలను ఎడిట్ చేయడం. కానీ అలా చేస్తే పాక్ అడ్డంగా దొరికిపోతుంది.