లక్షద్వీప్.. ఇప్పటికీ జీరో కరోనా కేసులు.. ఎలా సాధ్యపడింది..? ఎలా నియంత్రించగలిగారు..?
ఓవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.20లక్షలు దాటింది. కానీ లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రం ఇంతవరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నాగాలాండ్,సిక్కీం కూడా కరోనా ఫ్రీ రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. లక్షద్వీప్ విషయానికొస్తే.. ఈ ద్వీపం కరోనా ఫ్రీగా ఉండటం వెనుక అక్కడి అధికార యంత్రాంగం కృషి చాలా ఉంది. కరోనా తొలి అలర్ట్ వచ్చిన నాటి నుంచే ఇక్కడ కట్టుదిట్టమైన చర్యలను అమలుచేస్తూ వస్తున్నారు. ముందస్తు సంసిద్దత,ప్రతీ ఒక్కరికీ కరోనా టెస్టులు,కఠినమైన క్వారెంటైన్ చర్యల కారణంగా కరోనా బారిన పడకుండా ఉన్నారు.
ఎలా నియంత్రించగలిగారు...
60వేల జనాభా కలిగిన లక్షద్వీప్ తమ మెడికల్ అవసరాల కోసం ఎక్కువగా కేరళ పైనే ఆధారపడుతోంది. ఆ రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ చర్యలకు పూనుకుంది. 'మొదట్లోనే మేము రాకపోకలను నియంత్రించగలిగాం. తొలుత విదేశీ యాత్రికులపై నిషేధం,ఆపై స్వదేవీ యాత్రికులపై కూడా నిషేధం విధించాం. లాక్ డౌన్ పీరియడ్లో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల రాకపోకలను నిషేధించాం. వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన లక్షద్వీప్ స్థానికుల్లో కొందరు తిరిగి వచ్చేస్తామంటే.. వారందరికీ కొచ్చి,మంగళూరుల్లో ఆర్టీ-పీసీఆర్ ప్రక్రియలో కరోనా టెస్టులు నిర్వహించాం. నెగటివ్గా తేలితేనే వారిని లక్షద్వీప్లోకి అనుమతించాం. పరీక్షల్లో అందరికీ నెగటివ్గానే నిర్దారణ అయింది.' అని లక్షద్వీప్ హెల్త్ సెక్రటరీ సుందర వడివేలు తెలిపారు.
విస్తృత అవగాహన.. విస్తృత టెస్టులు..
లాక్ డౌన్ తొలినాళ్లలో లక్షద్వీప్లో వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజలందరికీ కరోనాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. ద్వీపంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా కరోనాపై అవగాహన కలిగేలా చేశారు. ఇందుకోసం ఆశావర్కర్స్,అంగన్వాడీలను ఉపయోగించుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఈ క్రమంలో ఎవరికైనా కోవిడ్ 19 లక్షణాలు ఉంటే వారు హెల్ప్ లైన్కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చేవారు. దీంతో వైద్యులు అక్కడికి వెళ్లి అనుమానితుల శాంపిల్స్ తీసుకుని వాటిని కేరళలోని ల్యాబ్కి పంపించేవారు. అలా పంపించిన శాంపిల్స్ అన్నీ నెగటివ్గానే తేలాయి.
కఠినంగా క్వారెంటైన్ ఆంక్షలు...
ముందు జాగ్రత్తలో భాగంగా.. లక్షద్వీప్ వెలుపలి నుంచి వచ్చినవారికి నెగటివ్గా తేలినా సరే.. 14 రోజుల పాటు వారిని హోమ్ క్వారెంటైన్ చేశారు. అంతేకాదు,వారి కుటుంబాలను కూడా క్వారెంటైన్లో ఉంచారు. ఇదే క్రమంలో ఏప్రిల్ మొదటివారంలో కవరత్తిలోని ఇందిరా గాంధీ ఆసుపత్రిని ప్రత్యేకించి కోవిడ్-19 కోసం కేటాయించారు. ఇందులో ఐసోలేషన్ బెడ్స్,ఐసీయూ బెడ్స్,వెంటిలేటర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 11 క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిని ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడలేదు. కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ కంటే మరింత మెరుగ్గా ఇక్కడి క్వారెంటైన్ కేంద్రాల్లో సదుపాయాలను ఏర్పాటు చేశారు.
ఇప్పుడు మరింత అప్రమత్తంగా..
గతంలో నిఫా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ను నియంత్రించిన ట్రాక్ రికార్డు కేరళకు ఉంది. అలాంటి రాష్ట్రంతో సమన్వయంలో ఉండటంతో లక్షద్వీప్ కూడా చాలావరకు కట్టుదిట్టమైన చర్యలను అమలుచేయగలిగింది. తాజా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో లక్షద్వీప్ అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'లక్షద్వీప్లోకి ఎవరిని అనుమతించాలి... ఎవరిని అనుమతించకూడదన్న విషయంలో మేమొక ప్రోటోకాల్ రూపొందించబోతున్నాం. ఒకవేళ కోవిడ్-19 కాకుండా ఇతర ఎమర్జెన్సీ పనుల నిమిత్తం ఎవరైనా బయటకు వెళ్లాలనుకుంటే... వారిని షిప్స్ ద్వారా పంపిస్తాం. కోవిడ్19కి సంబంధించిన ఎమర్జెన్సీ అయితే.. వారిని విమానాల ద్వారా పంపిస్తాం.' అని అక్కడి అధికారులు తెలిపారు. కేరళలో పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులు లేదా వలస కూలీలు ఈ-జాగ్రత పోర్టల్ ద్వారా పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అయితే అక్కడినుంచి తిరిగి వచ్చేవారు.. కోవిడ్ 19 నెగటివ్ అయితేనే అనుమతిస్తామని చెప్పారు.