ఎలా కీ రోల్ పోషించారంటే?: సర్జికల్ స్ట్రైక్స్ కోసం 'స్వాతి'ని సిద్ధం చేయించిన పారికర్
న్యూఢిల్లీ: 2016 సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మనోహర్ పారికర్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. క్లోమ గ్రంథి క్యాన్సర్తో బాధపడుతూ ఆయన ఆదివారం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రైక్ -2016 సమయంలో పారికర్ పాత్రను గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఆయనది కీలక పాత్ర. సర్జికల్ స్ట్రైక్స్ కోసం అదనంగా సైనికులకు శిక్షణ ఇచ్చారు. వారికి అందుకు అవసరమైన ఆయుధాలు సమకూర్చారు.
పుల్వామా దాడి తర్వాత పాక్ సమీపంలో 70కి పైగా వార్షిప్స్: ఐఎన్ఎస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు సహా..
యూరీ దాడికి ప్రతీకారం
మాకు యుద్ధం చేయాలనే ఆలోచన లేదని, కానీ తమ వైపు ఎవరైనా చూస్తే మాత్రం వారి కళ్లు పీకి చేతిలో పెడతామని మనోహర్ పారికర్ ఓ సమయంలో హెచ్చరించారు. ఆయన రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో సర్జికల్ స్ట్రైక్ ద్వారా చేసి చూపించారు. 2014 నుంచి 2017 వరకు మూడేళ్ల పాటు రక్షణ మంత్రిగా ఉన్న ఆయన హయాంలో 29 సెప్టెంబర్ 2016లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. దీని రూపకర్త ఆయనే. యూరి ఉగ్రవాద దాడిలో 18 మంది సైనికులు అమరులయ్యారు. కొద్ది రోజుల్లోనే ప్రతీకారం తీర్చుకున్నారు.
రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ప్లాన్
సరిహద్దుల్లో పాకిస్తాన్ నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచే విషయం తెలిసిందే. మరోవైపు తీవ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనోహర్ పారికర్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉగ్రవాద దాడులకు ఎలా సమాధానం ఇవ్వాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేసుకొన్నారు. యూరి దాడిలో జవాన్లు మరణించడంతో పారికర్ చాలా అవమానంగా భావించారు. వెంటనే సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావించారు. సైనికులను సిద్ధం చేసి వారికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారు.
స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్
సర్జికల్ స్ట్రైక్స్ కోసం రక్షణ పరిశోధనాశాల 'స్వాతి' అనే వెపన్ లొకేటింగ్ రాడార్ను త్వరితగతిన సిద్ధం చేయించారు. దీనిని డీఆర్డీవో సిద్ధం చేసింది. ఇది తయారు చేసిన మూడు నెలల్లోనే సైన్యంలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు సర్జికల్ స్ట్రైక్స్ కోసం కావాల్సిన ఆయుధాలు సిద్ధం చేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లో వెళ్లి దాడిచేసేందుకు పారికర్ అంగీకరించలేదు. దీని కోసం వారికి శిక్షణ ఇచ్చారు.
అంతకుముందు కూడా ఓ సర్జికల్ స్ట్రైక్
2015లో మయన్మార్ సరిహద్దుల్లో భారత్ జూన్ 8న సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దీనికి ముందు జూన్ 4వ తేదీన డోగ్రా రెజిమెంట్కు చెందిన 18 మంది జవాన్లను ఉగ్రవాదులు చంపేశారు. ఆ సమయంలో పారికర్ మాట్లాడుతూ కేవలం 200 మంది ఉన్న ఒక ఉగ్రసంస్థ మన జవాన్లను చంపడాన్ని నేను అవమానంగా భావిస్తున్నానని, ఇది దేశ సైన్యానికే అవమానమని, అందుకే తాము ససర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేశామని, 8 జూన్న ప్లాన్ చేశామని, ఈ దాడిలో భారత్-మయన్మార్ సరిహద్దుల్లో 70 నుంచి 80 టెర్రరిస్టులు చనిపోయారని చెప్పారు.