"మోడీ బాబు.. ఇలా ఇంకెంతమంది చనిపోవాలి?"
నోట్ల రద్దు నిర్ణయాన్ని తొలినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
కోల్ కతా: నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ మమతా బెనర్జీ ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమె మరోసారి మోడీపై విమర్శలు చేశారు. 'మోడీ బాబూ.. మీ నిర్ణయం వల్ల ఇంకెంతమంది చనిపోవాలి?' అంటూ ట్వీట్ చేశారు. టీఎంసీ ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ దాన్ని రీట్వీట్ చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో.. ఏటీఎంలు,బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నిలబడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 95మందికి చేరిందని పేర్కొన్నారు.
కాగా, గత నెల 8వ తేదీన రూ.500,రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్కెట్లోకి తగినంత కరెన్సీ రాకపోవడంతో సామాన్యులు తమ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిలో అల్లాడుతున్నారు.