రాజీవ్, ఇందిర పెద్దతప్పు చేశారు: చిద్దు, ఇన్నేళ్లా: రష్దీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సంతతి బ్రిటన్ రచయిత సల్మాన్ రష్దీ పుస్తకం 'సాటానిక్ వర్సెస్'ను నిషేధించడం నాటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన పెద్ద తప్పు అన్నారు.
ఈ విషయం గురించి తానను ఆ రోజు అడిగినా కూడా అది తప్పు అని చెప్పేవాడినని చిదంబరం అన్నారు. 1986 నుంచి 1989 మధ్య కాలంలో రాజీవ్ గాంధీ కేబినెట్లో చిదంబరం మంత్రిగా ఉన్నారు. ఇందిరా గాంధీ అత్యయిక స్థితి విధించడం కూడా తప్పేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని 1980లో ఆమె కూడా చెప్పారన్నారు.
ప్రస్తుతం దేశంలో అసహన వాతావావరణం నానాటికి పెరుగుతోందని ఆయన చెప్పారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితుల పైన పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని చిదంబరం ఈ సందర్భంగా చెప్పారు.
తప్పు సరిదిద్దుకునేందుకు ఎన్నేళ్లు: రష్దీ
తాను రాసిన ది సాటానిక్ వర్సెస్ పుస్తకాన్ని నిషేధించి, ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ తప్పు చేశారని మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం వ్యాఖ్యలపై సల్మాన్ రష్దీ స్పందించారు.
తప్పును అంగీకరించేందుకు 27 సంవత్సరాలు పట్టిందని, ఇక దానిని సరిదిద్దుకునేందుకు ఎంత కాలం పడుతుందని ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఈ వివాదాస్పద పుస్తకం 1988లో విడుదల కాగా, ఓ ఇరాన్ మత పెద్ద అయాతుల్లా కొమెన్ని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి రష్దీని హత్య చేయాలంటూ ఫత్వా జారీ చేయడంతో ఎన్నో దేశాలు పుస్తకాన్ని నిషేధించాయి.