బీజేపీని మోడీ కాపాడిన రోజు! ఎలా అంటే? కాంగ్రెస్ కంటే అదే పెద్ద ఛాలెంజ్, నెగ్గారు
అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని ఓటమి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కాపాడారా? అంటే అవుననే అంటున్నారు. సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించడం ద్వారా, ధీటుగా స్పందించడం ద్వారా మరోసారి గెలిపించారని అంటున్నారు.
బీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలు
జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలు సంస్కరణలకు సంబంధించినవి. వీటి వల్ల ప్రజలు ఇబ్బందిబడ్డారు. ఆ ఆగ్రహం కేంద్రంపై ఉండటం సహజం. అలాగే, మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్ బీజేపీ పరిస్థితి ఆశించిన విధంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని తన వాక్చాతుర్యంతో మోడీ గెలిపించారని అంటున్నారు.
ఊహించని దెబ్బ: మోడీ దూకుడుకు 'గుజరాత్' కళ్లెం, ఆ వైపు మోడీ చూపు!
అనూహ్యంగా కొన్ని సీట్లతో గట్టెక్కింది
ఫలితాలు వచ్చిన ఈ రోజు (సోమవారం-18-12-2017)ని బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. కానీ గుజరాత్లో కాంగ్రెస్కు పలువురి మద్దతు, జీఎస్టీ, నోట్ల రద్దు, స్థానిక బీజేపీ ఆకట్టుకోలేకపోవడం వంటి కారణాలతో ఆ పార్టీ ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి. కానీ అనూహ్యంగా కొద్ది సీట్లతో గట్టెక్కింది.
బీజేపీ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు
ఈ ఫలితాలు బీజేపీకి ఓ విధంగా చేదు అని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు, పటీదార్ ఉద్యమం వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటే గెలుపు గగనమే అని చెప్పవచ్చు. మరోవైపు ఇరవై రెండేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉంటుంది. వీటన్నింటిని తట్టుకొని బిజెపి గెలుపొందింది. ఓ సమయంలో బీజేపీ ఓటమి ఖాయమని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ గెలుపును ప్రధాని మోడీ భుజానికెత్తుకున్నారని చెప్పవచ్చు.
నేను వికాస్ అంటూ
బీజేపీ అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకుంది. కాంగ్రెస్ దానిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అభివృద్ధి అంతా ఉత్తిదే అని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నాలు చేసింది. ఈ సమయంలో మోడీ.. నేను వికాస్, నేను గుజరాత్ అంటూ నినదించారు. అభివృద్ధి, నీరు, విద్యా తదితర అంశాలతో పాటు ఆయా నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ఆయా అంశాలపై స్పందించి కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అలా తిప్పికొట్టారు
మోడీ ప్రభుత్వం ధనవంతులకు అండగా ఉందని, పేదల కోసం పని చేయడం లేదని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీనిని మోడీ తనదైన శైలిలో తిప్పికొట్టారు. మధ్యతరగతి వారికి సరసమైన ధరలకు ఇళ్లు, స్టెంట్ ధరలు తగ్గించడం వంటి అంశాలను మోడీ ప్రస్తావించారు. పేదవారికి ఉచిత టాయిలెట్ల అంశాన్ని ప్రస్తావించారు.
మోడీకి అతి పెద్ద ఛాలెంజ్ జీఎస్టీ
మోడీకి జీఎస్టీ అతిపెద్ద ఛాలెంజ్గా నిలిచింది. గుజరాత్లో వ్యాపారులు ఎక్కువ. జీఎస్టీ కారణంగా వారు ఆగ్రహానికి, అసంతృప్తికి లోనయ్యారు. ఈ విషయంలోను మోడీ వ్యాపారులను మెప్పించి, ఒప్పించే ప్రయత్నం చేశారు. జీఎస్టీని చూపించి కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇలాంటి సంస్కరణలు భారత్ భవిష్యత్తుకు అవసరమని చెప్పే ప్రయత్నం చేశారు. వీటి వల్ల ముందు ముందు ఉపయోగం ఉంటుందని చెప్పి ఓటర్లను తమ వైపుకు మలుపుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్తో పాటు జీఎస్టీ కూడా బీజేపీకి అది పెద్ద ఛాలెంజ్గా నిలిచింది.
అలా ఓటమి దరి నుంచి బయటపడేశారు
బీజేపీ నుంచి విముక్తి అంటూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో నినదించింది. అయితే అదే సమయంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను మోడీ అంది పుచ్చుకున్నారు. తనను నీచ్ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తన వాక్చాతుర్యంతో ఓట్లను బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఇందులో ఆయన సఫలమయ్యారని అంటున్నారు. లేదంటే 22 ఏళ్ల పాటు పాలిస్తున్నందున ప్రజా వ్యతిరేకత, పటీదార్ ఉద్యమం, ఓబీసీ, దళిత్ నేతల మద్దతుతో కాంగ్రెస్ దూకుడు, జీఎస్టీ, నోట్ల రద్దు.. వీటన్నింటితో బీజేపీ ఓడిపోవాల్సిన పరిస్థితి అని. కానీ మోడీ తన అభివృద్ధి నినాదం, వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకున్నారని అంటున్నారు.
ఇలా గట్టెక్కించారు
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టే సమయంలో ఔరంగజేబు వ్యాఖ్యలు, రామజన్మభూమిపై కపిల్ సిబాల్ విజ్ఞప్తికి కౌంటర్.. ఇలా ప్రతి విషయంలో మోడీ తనదైన శైలిలో స్పందించి బీజేపీని గట్టెక్కించారని అంటున్నారు. కాగా, 2014లో మోడీ హవా వల్లే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.