నోట్లరద్దుతో ఎంత నల్లధనం బయటపడిందో తెలియరాలేదు: ఆర్బీఐ
పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం బయటపడిందో తమ వద్ద సమాచారం లేదని ఆర్బీఐ పార్లమెంటరీ ప్యానల్కు తెలియజేసింది.
ముంబై: పెద్ద నోట్ల రద్దు వల్ల ఎంత నల్లధనం బయటపడిందో తమ వద్ద సమాచారం లేదని ఆర్బీఐ పార్లమెంటరీ ప్యానల్కు తెలియజేసింది.
వెనక్కి వచ్చిన రూ.500, రూ.1000 నోట్లలో రూ.15,280 కోట్ల చెల్లని నోట్లు ఉన్న నేపథ్యంలో తనిఖీ ప్రక్రియ జరుగుతోందన్నారు. నల్లధనం వెలికి తీసేందుకు, నకిలీ నోట్ల గుర్తింపు, ఇతర ప్రయోజనాల కోసం పెద్దనోట్లు రద్దు చేయడంతో ఆర్బీఐ విమర్శల పాలైన సంగతి తెలిసిందే.
ఆర్బీఐ గతవారం 2016-17 వార్షిక నివేదికను వెల్లడించింది. రద్దైన నోట్లలో 99 శాతం తిరిగి బ్యాకింగ్ వ్యవస్థలోకి వచ్చినట్టు ఈ సందర్భంగా ప్రకటించింది.
తనిఖీ ప్రక్రియ పూర్తికానందున, భవిష్యత్తులో చేసే దిద్దుబాటుకు లోబడి, 2017 జూన్ 30 నాటికి రూ.15.28 లక్షల కోట్ల విలువైన స్పెసిఫైడ్ బ్యాంకు నోట్లు (ఎస్బీఎన్లు) అందాయని ఆర్బీఐ వెల్లడించింది. దీంతో ప్రతిపక్షాలన్నీ విమర్శలు ఎక్కుపెట్టాయి.
బ్యాకింగ్ వ్యవస్థలోకి వచ్చిన నోట్లు బ్యాంకులు, తపాలా కార్యాలయం చెస్టుల్లో భద్రంగా ఉన్నాయని పార్లమెంటరీ ప్యానల్కు తెలిపింది.
భారీ స్థాయిలో ఉన్నందున నోట్ల తనిఖీ ప్రక్రియకు ఇంకా సమయం పడుతుందని పేర్కొంది. సాంకేతికంగా అత్యంత నాణ్యమైన యంత్రాలతో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు పగలు, రాత్రి పని చేస్తున్నాయని తెలిపింది. ప్రక్రియ పూర్తైతేనే పూర్తి వివరాలు అందుతాయని చెప్పింది.