నోట్ల రద్దు వల్ల లాభాలేంటి, నష్టాలేంటి: ఇదీ లెక్క, రూ.2 లక్షల కోట్ల నష్టం!
నోట్లను రద్దు చేసి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నల్లధన వ్యతిరేక దినం అంటూ సంబరాలు చేసుకుంటుండగా, నోట్ల రద్దు వల్ల పలువురు మృతి చెందారని, జనాలు ఇబ్బందిపడ్డారని విపక్షాలు బ్లాక్ డే అంటున్నారు.
న్యూఢిల్లీ: నోట్లను రద్దు చేసి ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నల్లధన వ్యతిరేక దినం అంటూ సంబరాలు చేసుకుంటుండగా, నోట్ల రద్దు వల్ల పలువురు మృతి చెందారని, జనాలు ఇబ్బందిపడ్డారని విపక్షాలు బ్లాక్ డే అంటున్నారు.
Recommended Video
గుజరాత్లో గెలిస్తే మోడీ మరో సాహసేపేత నిర్ణయం, తెరపైకి బీటీటీ: ఏమిటిది?
ఈ నేపథ్యంలో నోట్ల రద్దు వల్ల లాభనష్టాల పైన చర్చ సాగుతోంది. అలాగే, నగదురహిత లావాదేవీల్లో అనుకున్నంత దూకుడు కనిపించడం లేదని అంటున్నారు. మొత్తానికి నోట్ల రద్దు ఏడాది నేపథ్యంలో మరోసారి చర్చకు వచ్చింది.
నోట్లరద్దు వల్ల వ్యభిచారం తగ్గింది: కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్
చలామణిలో ఉన్న నగదు ఎంత, బ్యాంకులకు చేరింది ఎంత?
నోట్ల రవద్ద వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతోంది. నోట్ల రద్దు ప్రకటన నాటికి దేశంలో రూ.17.50 లక్షల కోట్లు చలామణిలో ఉంది. అందులో రూ.500, రూ.1000 నోట్లు రూ.15.44 లక్షల కోట్లు. అంటే అప్పటికి చలామణిలో ఉన్న నగదులో 86 శాతం ఈ పెద్దనోట్లదే. ఇందులో 2017 జూన్ 30 నాటికి బ్యాంకుల్లో రూ.15.28 లక్షల కోట్లు డిపాజిట్ అయింది. బ్యాంకులకు చేరనిది రూ.16,000 కోట్లు. నోట్ల ముద్రణకు 2014-15లో రూ.3762 కోట్లు, 2015-16లో రూ.3421 కోట్లు, 2016-17లో రూ.7965 కోట్లు అయ్యాయి.
పన్ను చెల్లింపులు పెరిగాయి
పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చిన వారు 56 లక్షల మంది. ఆదాయపన్ను రిటర్న్లు దాఖలు 24.7 శాతం పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే వ్యక్తిగత ఆదాయపన్నులో ముందస్తు వసూళ్లు 41 శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.
డొల్ల కంపెనీలకు షాక్
మూడు లక్షలకు పైగా డొల్ల కంపెనీల అనుమానాస్పద లావాదేవీలపై నిఘా కొనసాగుతోంది. 2.1 లక్షల డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. స్టాక్ ఎక్సేంజ్లో వందల కొద్ది కంపెనీల నమోదు రద్దయింది. 400కు పైగా బినామీ ఆస్తులను గుర్తించారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో..
బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. వడ్డీ రేట్ల బేసిస్ పాయింట్లు తగ్గేందుకు ఉపయోగపడింది. 2016 అక్టోబర్ నాటికి 76.27 కోట్లుగా ఉన్న డిజిటల్ చెల్లింపులు 2017 మే నాటికి 111.45 కోట్లకు పెరిగింది. నోట్ల రద్దు తర్వాత కోటి మందికి పైగా కార్మికులు ఈపీఎఫ్, ఈఎస్ఐసీ వ్యవస్థలో చేరారు. వేతనాలు నేరుగా అకౌంట్లలో జారీ చేయడం కోసం బ్యాంకు ఖాతాలు తెరిచిన కార్మికులు 50 లక్షలమంది.
నోట్ల రద్దు వల్ల లాభాలు
29 రాష్ట్రాల్లో రూ.11.23 కోట్ల విలువైన నకిలీ నోట్లు గుర్తించారు. జమ్ము కాశ్మీర్లో తీవ్రవాద దాడులు, రాళ్ల దాడులుతగ్గాయి. నక్సలైట్ల పైనా నోట్ల రద్దు ప్రభావం పడింది. హవాలా లావాదేవీలు సగానికి తగ్గాయి. పాకిస్తాన్లో ముద్రించిన నకిలీ నోట్ల మాఫియాకు ఎదురు దెబ్బ తగిలింది. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయి. డిజిటల్ పేమెంట్లు పెరిగాయి.
మరి బ్లాక్ మనీ ఏదీ
మరోవైపు, రద్దయిన సొమ్మంతా బ్యాంకుల్లో చేరిందని, మరి బ్లాక్ మనీ ఎక్కడ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కరెన్సీ కష్టాలు స్వల్పకాలమే ఉన్నాయని, కానీ దీర్ఘకాలంలో దీని వల్ల మేలు జరుగుతుందని బ్యాంకులు, నిపుణులు చెబుతున్నారు. నోట్ల రద్దుతో దేశ జీడీపీ పడిపోయింది. వేలమంది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుత దేశీయ స్థూల జాతీయోత్పత్తి రూ.130 లక్షల కోట్లుగా ఉంది. వృద్ధి రేటు ఒక శాతం తగ్గడం ద్వారా రూ.1.30 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అంటున్నారు. అన్నీ చూస్తే నోట్ల రద్దుతో రూ.2 లక్షల కోట్ల పైనే నష్టపోయినట్లుగా అంచనా వేస్తున్నారు.
జనాలు ఇబ్బంది పడ్డారు
ఇక, నోట్ల రద్దు వల్ల నాడు తాత్కాలికంగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంలు పని చేయక, చేతుల్లో డబ్బులు లేక తీవ్ర కష్టాలు పడ్డారు. చిన్నవ్యాపారాలు కుంటుపడ్డాయి. క్యాష్ లెస్ అనుకున్నంత వేగం పుంజుకోవడం లేదు. ఛార్జీలు భరించలేక వ్యాపారులు స్వైపింగ్ మిషన్లు వెనక్కి ఇస్తున్నారు.