మోదీ బాహుబలి ప్యాకేజీ : ఐదు కీలక అంశాలు.. వీటిల్లో ఇప్పటికిప్పుడు దేనికెంత ఇస్తారు?
కరోనా లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం(మే 12) రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. భారత జీడీపీలో ఇది 10శాతం. అమెరికా తమ జీడీపీలో 13శాతం ఉద్దీపన ప్యాకేజీగా ప్రకటించగా.. అగ్రరాజ్యానికి ఏమాత్రం తీసిపోని రీతిలో మోదీ ప్యాకేజీ ప్రకటించారు. కేంద్రం,ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించిన రూ.7.79లక్షల కోట్ల ప్యాకేజీని కూడా ఈ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. ఇక మిగిలింది రూ.12లక్షల కోట్లు. దీని నుంచి కేంద్రం ఏయే రంగాలకు,వర్గాలకు రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించబోతుందన్నది ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశం.
అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్యే వీరంగం- లాక్ డౌన్ ఉల్లంఘన- ఒడిశా పెళ్లి బస్సును విడిపించుకెళ్లిన వైనం...
ప్రత్యక్ష నగదు బదిలీ ఉంటుందా..?
రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అయితే ప్రకటించారు గానీ అంకెల్లో,కేటాయింపుల్లో మోదీ సర్కార్ చిత్తశుద్ది ఎంతన్నది కేంద్ర ఆర్థిక మంత్రి వివరాలను వెల్లడిస్తే గానీ తెలియలేదు. కరోనా కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వలస కార్మికులు,వారి కుటుంబాలకు ఈ ప్యాకేజీ ద్వారా ప్రత్యక్ష నగదు లేదా ఇతరత్రా లబ్ది ఏమైనా చేకూరుతుందా అన్నది వేచి చూడాలి. అసంఘటిత రంగానికి ఈ ప్యాకేజీ ఎంతవరకు రిలీఫ్ని చేకూరుస్తుందన్నది చూడాలి.
ఉద్యోగాలు కోల్పోయిన వారి సంగతేంటి..?
లాక్ డౌన్ అనిశ్చితి కారణంగా ఇప్పటికే 25శాతం మంది ఉద్యోగాలు కోల్పోగా.. మరో 25శాతం మంది ఉద్యోగాలు సందిగ్ధంలో పడ్డాయి. అంటే,భారత్లో పనిచేస్తున్న మొత్తం 500 మిలియన్ల ఉద్యోగుల్లో.. 250 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయి లేక ఉద్యోగం ఉంటుందో లేదోనన్న సందిగ్ధంలో చిక్కుకుపోయారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ 50శాతం మంది కుటుంబాల పోషణకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యలు ఉంటాయన్నది కూడా కీలకం కానుంది. కాబట్టి మోదీ సర్కార్ ప్యాకేజీని వీరిని ఎంతవరకు ఆదుకుంటుందో చూడాలి.
ప్యాకేజీ ఇస్తారా.. లేక ఉద్యోగ అవకాశాలు కల్పించేలా..
కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పేద,దిగువ మధ్య తరగతి కుటుంబాలకు, ఉద్యోగాలు కోల్పోయినవారికి ఇప్పటికిప్పుడు ఈ ప్యాకేజీ ద్వారా ఎంత నగదును అందించనున్నారన్నది కీలక అంశంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారిని ఆదుకుంటారా లేక చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు,ప్రోత్సహకాలు ప్రకటించడం ద్వారా తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేస్తారా అన్నది చూడాలంటున్నారు.
అదే జరిగితే కేంద్రం ఇచ్చేది ఏమీ లేనట్టే..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గత వారం సీఎన్బీసీతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎంఎస్ఎంఈ రంగానికి భారీ మొత్తంలో బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. అయితే అది ఎంత అనేది ఆయన వెల్లడించలేదు. ఎగుమతిదారులకు జీఎస్టీ వాపసు బకాయిలతో సహా ఇది కొన్ని లక్షల కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. అయితే ఈ బకాయిలతో సంబంధం లేకుండా బ్యాంకుల నుంచి ఎంఎస్ఎంఈలు రుణాలు పొందేలా ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని గడ్కరీ చెప్పారు. ఒకవేళ దీన్నే గనుక ఉద్దీపన ప్యాకేజీకి జోడించి చేతులు దులుపుకుంటే అంతకంటే అన్యాయం ఉండదంటున్నారు. ఎందుకంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటికే న్యాయంగా ఎంఎస్ఎంఈలకు రావాల్సిన బకాయిలు చెల్లించకపోగా.. కేవలం బ్యాంకు రుణాలకు గ్యారంటీ ఇస్తామని ప్రకటించడం ఉపశమన చర్యల కిందకు రాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video
ఎంత నగదు పంప్ చేస్తారు..
కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించడం మంచిదే. కానీ ఇందులో ఎంతమేర ప్రత్యక్షంగా నగదును పంప్ చేస్తారన్నది కీలకం అంటున్నారు. అలా కాకుండా కొత్త అప్పులను జీడీపీలో 3 నుంచి 4శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంటే.. అవే రూ.6లక్షల కోట్లు నుంచి రూ.8లక్షల కోట్లు వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే ప్యాకేజీ పేరుకు మాత్రమే భారీగా కనిపిస్తుందని అంటున్నారు.