ఎన్ఐఏ విచారణ: మావోయిస్టులకు నిధులు ఎలా ఎవరు సమకూరుస్తున్నారో తెలుసా..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదురాష్ట్రాల ఎన్నికల హడావుడి జోరందుకుంది. ఈ క్రమంలోనే మావోయిస్టుల కదలికలు కూడా ఊపందుకున్నాయి. ఛత్తీస్గడ్ రాష్ట్రంలో కొద్దిరోజుల వ్యవధిలోనే ఆరుదాడులు జరిగాయి. అసలు మావోయిస్టులకు భారీగా నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. వారికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు..విచారణ సంస్థలు ఏమి చెబుతున్నాయి..?
మావోయిస్టులు
దేశంలో ఎన్నికల ఫీవర్ పెరిగిపోతోంది. అదే సమయంలో దీన్నే ఆసరాగా తీసుకున్నారు మావోయిస్టులు. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సోమవారం ఛత్తీస్గఢ్లో పోలింగ్ సందర్భంగా మావోల దాడులు కలకలం రేపాయి. అంతకుముందు రోజు అంటే ఆదివారం కూడా ఛత్తీస్గడ్ లో నక్సల్స్ మందుపాతర పేల్చారు. ఇలాంటి దాడులు చేయడానికి గానీ... ఇతర కార్యక్రమాలకుగానీ నక్సలైట్లకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసిన జాతీయ విచారణ సంస్థ విస్తుపోయే నిజాలను వెల్లడించింది.
బొగ్గు కాంట్రాక్టర్ల నుంచే నిధులు సమకూరుతున్నాయి
ఇక మావోయిస్టులకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయో తెలుసా... బొగ్గు గనుల్లో నుంచి బొగ్గును రవాణా చేసే కాంట్రాక్టర్లే మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్నారని జాతీయ విచారణ సంస్థ ఎన్ఐఏ వెల్లడించింది. బొగ్గు రవాణా చేసేందుకు కాంట్రాక్టర్లు తీసుకోవాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువగా తీసుకుని... అసలు ధర తమవద్దే ఉంచుకుని మిగిలిన డబ్బులు మావోయిస్టులకు బదిలీ చేస్తున్నారని ఎన్ఐఏ వివరించింది. ఇలా డబ్బులు మావోలకు సమకూరుస్తున్న సంస్థల్లో ఒకటి త్రితియా ప్రస్తుతి కమిటీ టీపీసీ తమ దృష్టికి వచ్చినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఈ సంస్థ మావోల నేతృత్వంలో నడుస్తుందని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ క్రమంలోనే సెంట్రల్ కోల్ ఫీల్డ్లో ఉద్యోగిగా పనిచేస్తున్న సుభాన్ మియా అనే వ్యక్తిని ఎన్ఐఏ నవంబర్ 4న అరెస్టు చేసింది.
పకడ్బందీగా ప్లాన్ చేసి డబ్బులు మావోలకు బదిలీ
ఎన్ఐఏ అరెస్టు చేసిన సుభాన్ మియాపై పలు కేసులున్నాయి. మావోయిస్టులకు నిధులు చేరవేయడంలో వ్యూహాన్ని రచించేవాడని ఎన్ఐఏ తెలిపింది. ఆమ్రపాలి మగద బొగ్గు ప్రాంతంలో పలు దోపిడీలకు పాల్పడ్డాడని ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు తృతియా ప్రస్తుతి కమిటీ, సీసీఎల్, గ్రామస్తుల కమిటీల మధ్య సమావేశం నిర్వహించేందుకు మధ్యవర్తిత్వం వహించేవాడని ఎన్ఐఏ తెలిపింది. తన రవాణా కంపెనీ ద్వారా నిదులు సేకరించి వాటిని తృతీయ ప్రస్తుతి కమిటీకి చేరవేసేవాడని జాతీయ విచారణ సంస్థ వెల్లడించింది.
తృతీయ ప్రస్తుతి కమిటీకి నిధులు ఇస్తున్న కాంట్రాక్టర్
సోమవారం రోజున జార్ఖండ్ రాష్ట్రం సమారియా ప్రాంతానికి చెందిన సుదాంషు రాజన్ అలియాస్ చోటు సింగ్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. చోటుసింగ్ మావోల సంస్థ తృతీయ ప్రస్తుతి కమిటీకి నిధులు సమకూర్చేవాడని తెలిపింది. ఇదిలా ఉంటే టీపీసీ నేత అక్రమన్ అలియాస్ నేతాజీ సూచనల మేరకే చోటుసింగ్కు ఇక్కడి ప్రాంతంలోని బొగ్గురవాణా కాంట్రాక్టు దక్కిందని ఎన్ఐఏ వెల్లడించింది. నిధులు సమకూర్చుకోవడంలో ఇలాంటి పద్దతులను మావోయిస్టులు అవలంబిస్తున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.