రైతన్నకు ఎంత కష్టం: పొలం దున్నేందుకు కొడుకులే ఎడ్లయ్యారు
పాట్నా: ఇది బీహార్ రైతు కన్నీటి గాధ. అన్నం పెట్టే రైతన్న తన భూమిని దున్నేందుకు ఎద్దులు లేక కన్న కొడుకులనే ఆస్థానంలో ఉంచి పొలాన్ని దున్నాడు.ఈ ఘటన చాప్రా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలోలో వైరల్ అయ్యాయి. అసలు ఎద్దుల స్థానంలో కొడుకులను ఉంచాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అని రైతు జవహర్ రాయ్నే అడిగితే అతను కన్నీటి పర్యంతం అయ్యాడు. కఠిక పేదరికంలో బతుకుతున్న తాము రెండు ఎద్దులను కొనుక్కునే ఆర్థిక స్తోమత లేదన్నాడు. అంతకుముందు తన ఇద్దరి కొడుకులు పడవల్లో మట్టిని తరలించేవారని ఆ సమయంలో కాస్తో కూస్తో కడుపులోకి నాలుగు ముద్దలు వెళ్లేవని గుర్తు చేసుకున్న రైతు జవహర్ రాయ్... ఇప్పుడు అది ఆగిపోవడంతో కొన్ని రోజులు పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఫోటో వైపు చూపిస్తూ ఇద్దరి కొడుకుల వెనకాల విత్తనాలు చల్లుతూ కనిపించిన మహిళ తన భార్య లీలావతి అని చెప్పాడు జవహర్ రాయ్. తమకు సహాయం చేయాల్సిందిగా ఉన్నత స్థితిలో ఉన్న రైతులను ప్రాధేయపడగా ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదని బాధ వ్యక్తం చేశాడు. ఇక ఎంతమాత్రం వేచిచూడకుండా తన పనిని మొదలు పెట్టినట్లు చెప్పారు. ఒకవేళ వర్షాలు కురవకుంటే మట్టిలోని తేమ ఎండిపోతుందని చెప్పాడు. అందుకే తన కొడుకుల సహాయంతో పొలం దున్నుకుంటున్నట్లు చెప్పాడు.
ఇక ఈ ఫోటో వైరల్ అవడంతో కొందరు మానవతావాదులు స్పందించారు. బీహార్ ప్రభుత్వం జవహర్ రాయ్ రైతుకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే నితీష్ సర్కార్ పై విపక్షాలు నిప్పులు చెరిగాయి. ఇది జవహర్ రాయ్ రైతు ఒక్క పరిస్థితే కాదని రాష్ట్రంలో ఇంకా చాలామంది జవహర్ రాయ్లు ఇలానే ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇప్పటికైనా జవహర్ రాయ్ దుస్థితిని గమనించి ప్రభుత్వం సహాయం చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.