పాకిస్తానా? ఛీ.. ఛీ! ఇదీ మెజారిటీ భారతీయుల భావన, మోడీకి ఓకే, కానీ...
న్యూఢిల్లీ: పాకిస్తాన్.. ఈ పేరు వింటేనే చాలా మంది భారతీయులకు ఒళ్లు మండిపోతుంది. తాజాగా ఓ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. 70 ఏళ్లుగా పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్ను మెజారిటీ భారతీయులు అసహ్యించుకుంటున్నారట.
వాషింగ్టన్కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ఏకంగా 72 శాతం మంది భారతీయులకు పాకిస్తాన్పై సదభిప్రాయం లేదని వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 2464 మంది అభిప్రాయం తెలుసుకున్నారు.
గత రెండు, మూడేళ్లతో పోలిస్తే పాకిస్తాన్పై ఇండియన్స్లో ప్రతికూల వైఖరి పెరిగిపోయినట్లు ఈ సర్వేతో స్పష్టం చేసింది. 2013లో 54 శాతం మంది, 2014లో 49 శాతం మంది పాకిస్తాన్ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు.
అదికాస్తా ఇప్పుడు 72 శాతానికి చేరింది. అందులోనూ మిగతా దేశంతో పోలిస్తే.. ఉత్తర భారతంలో, పాక్తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాల ప్రజల్లో ఈ వ్యతిరేక భావన మరీ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఇక పాక్ అంటే అసహ్యం అన్న వాళ్లలో కాంగ్రెస్, బీజేపీ అనుచరులన్న తేడా కూడా పెద్దగా లేదు. బీజేపీ ఫాలోవర్స్లో 70 శాతం మంది, కాంగ్రెస్ ఫాలోవర్స్లో 63 శాతం మంది పికిస్తాన్ పట్ల వ్యతిరేక భావంతో ఉన్నారు.
ఇదే సమయంలో 88 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ విధానాల పట్ల సానుకూలంగా ఉండటం విశేషం. అయితే పాకిస్తాన్ విషయంలో ఆయన వైఖరిని మాత్రం కేవలం 21 శాతం మంది మాత్రమే సమర్థించారు.
అలాగే.. కశ్మీర్ అంశంపైనా ఈ సర్వేలో ప్రశ్నలు అడిగారు. 62 శాతం మంది కశ్మీర్ అంశం చాలా తీవ్రమైన సమస్య అని చెప్పారు. 63 శాతం మంది కశ్మీర్లో మిలిటరీ చర్యలను మరింత బలంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.