పెట్రోల్ బంకులు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాయో తెలుసా?
చాలా పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులను తమ జేబుల్లో వేసుకుంటున్నారు.
న్యూఢిల్లీ: ప్రతీ యేడాది రోడ్డుపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే పెట్రోల్ ధరలు కూడా ఆకాశన్నంటుతున్నాయి. చాలా పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బులను తమ జేబుల్లో వేసుకుంటున్నారు.
పెట్రోల్ బంకులు మోసం చేసి మీ డబ్బును ఎలా తీసుకోగలుగుతున్నాయి. పెట్రోల్ బంకులు కస్టమర్లను ఎలా మాయ చేస్తున్నారంటే..
మీరు మీ వాహన పెట్రోల్ ట్యాంకులో పెట్రోల్ పోయించుకునేప్పుడు పెట్రోల్ బంకుల వద్ద జాగ్రత్తగా గమనించాలి. పెట్రోల్ పోసేటప్పుడు పెట్రోల్ బంకు సిబ్బంది పెట్రోల్ను ఆపే ప్రయత్నం చేస్తుంటారు. పెట్రోల్ను ఆపి ఆపి పోయడం వల్ల మనం పోయించుకోవాలనుకున్న మొత్తం పెట్రోల్ కంటే.. తక్కువగానే మన వాహన ట్యాంకులో చేరుతుంది. బిల్లు మాత్రం ఆ మొత్తానికే పడుతుంది. అంటే పెట్రోల్ తక్కువగా పొందినా.. రేటు మాత్రం ఎక్కువగానే చెల్లిస్తున్నామన్న మాట.
పెట్రోల్ పైప్ ద్వారా వచ్చే పెట్రోల్ కూడా పూర్తిగా మన వాహన ట్యంకుకు చేరదు. దీంతో కూడా మనం పెట్రోల్ రావాల్సినంత రాదు. వినియోగదారుల దృష్టి మరల్చి కూడా పెట్రోల్ బంక్ సిబ్బంది తమ మోసాన్ని కానిచ్చేస్తారు. దీంతో వారు ఎంత పెట్రోల్ పోసింది మనకు అంతగా తెలియకపోవచ్చు. దీంతో కూడా మనం నష్టపోయే అవకాశం ఉంది. అందుకే పెట్రోల్ పోసుకునే సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
అంతేగాక, పెట్రోల్ బంక్ సిబ్బంది.. మేథమ్యాటికల్ ట్రిక్స్ కూడా ఉపయోగిస్తూ వినియోగదారులను మోసం చేస్తుంటారు. ఒక వినియోగదారుడు మొదట రూ.200 పెట్రోల్ పోయించుకునే వెళ్లిపోయాడనుకుందాం. ఆ తర్వాత వచ్చే వినియోగదారుడు రూ.1000 పెట్రోల్ తన వాహనం కొట్టించమన్నాడు. దీంతో ఆ సిబ్బంది పెట్రోల్ బంకులో రూ.200 రీడింగ్ ను అలాగే ఉంచి పెట్రోల్ పోసేస్తాడు. దీంతో ఈ వినియోగదారుడు రూ.800ల పెట్రోల్ కే రూ.1000 చెల్లించాల్సి వస్తుంది.
మరికొన్ని పెట్రోల్ బంకులు మీటర్ ట్యాంపరింగ్ కు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఒక వినియోగదారుడు రూ. 500తో పెట్రోల్ కొట్టించాలనుకున్నాడు. పెట్రోల్ బంకు సిబ్బంది రూ.500 రీడింగ్ పెట్టి పెట్రోల్ పోస్తుంటాడు. ఆ సమయంలో వినియోగదారుడు అప్రమత్తంగా లేకుంటే.. సగం వరకు పెట్రోల్ పోసి రూ.500 రీడింగ్ కు పెట్రోల్ సిబ్బంది ట్యాంపరింగ్ చేస్తుంటారు. ఈ మోసాలన్నీ మనకు తెలియకుండా ఎంతో జాగ్రత్తగా చేస్తుంటారు పెట్రోల్ బంకుల సిబ్బంది. అందుకే మనం పెట్రోల్ పోయించుకునే సమయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇది మాత్రమే మనల్ని మోసపోకుండా కాపాడగలదు.