అక్కడమ్మాయి..ఇక్కడబ్బాయి: ఇద్దరిని కలిపింది మాత్రం మన ప్రధాని మోడీనే..!
ప్రేమికుల రోజుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఆ వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అనేదానిపై ఫుల్ క్లారిటీతో ఉన్నాయి ప్రేమజంటలు. ఇక కొందరు అలా లాంగ్ డ్రైవ్కు వెళదామనుకుంటుండగా మరికొందరు అదేరోజున పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు. కొందరు వాలెంటైన్స్ వీక్లోనే పెళ్లి చేసుకుని చాలా ఆనందపడుతున్నారు. తాజాగా ఓ ప్రేమజంట వివాహం చేసుకుంది. వీరికి సంబంధం కుదిర్చింది ఎవరో తెలుసా... మన ప్రధాని మోడీనే. ఈ జంటకు పెళ్లి సంబంధం మోడీ ఎలా కుదిర్చారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
హన్సినిని గోవింద్లను కలిపిన ప్రధాని మోడీ
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న జంట పేరు హన్సిని ఇధీర్ సింఘే, గోవింద్ మహేశ్వరి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. హన్సినిది శ్రీలంక.. గోవింద్ది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్కు దగ్గరలో ఉన్న కుచ్రోద్ గ్రామం. ఎక్కడ శ్రీలంక.. ఎక్కడ కుచ్రోద్ గ్రామం... అయినా వీరిద్దరి మనసులు కలిశాయి. కాదు...కాదు.. వీరిద్దరి మనసులను ప్రధాని నరేంద్ర మోడీ కలిపారు.
మోడీ ట్వీట్తో ఒక్కటైన యువజంట
ఇదేంటి మోడీ వీరిద్దరిని కలపమడమేంటి అని అనుకుంటున్నారా...? పోనీ మోడీ శ్రీలంక వెళ్లిన సమయంలో గోవింద్కు ఈ సంబంధం పట్టకొచ్చాడని భావిస్తున్నారా... అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అంత బిజీగా ఉండే ప్రధాని పెళ్లి సంబంధాలు వెతికే తీరిక ఎక్కడుంటుంది చెప్పండి. కానీ వీరు మాత్రం తమను కలిపింది ప్రధాని మోడీనే అని చెబుతున్నారు. అంతేకాదు తమను కలిపిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెబుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ అకౌంట్ను గోవింద్ ఫాలో అవుతూ ఉంటాడు. ఓ సారి మోడీ ట్వీట్ చేసిన పోస్టుకు లైక్ తెలిపాడు. అదే సమయంలో లంకలో ఉన్న హన్సిని కూడా లైక్ కొట్టింది. ఇక అప్పటి నుంచి గోవింద్ హన్సిని ట్విటర్ను ఫాలో అవుతూ వచ్చాడు. ఆమె పెట్టిన పోస్టులకు రిప్లై ఇస్తూ వచ్చాడు. ఇదే వారి పరిచయానికి దారి తీసింది. అనంతరం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత గత రెండేళ్లుగా వీడియో కాలింగ్ కూడా చేసుకుంటూ ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని చివరిగా అక్టోబర్ 2017లో తొలిసారిగా ఒకరినొకరు కలుసుకున్నారు.
శ్రీలంకకు అబ్బాయి... భారత్కు అమ్మాయి
ఇక భారత సంస్కృతిని తెలుసుకునేందుకు హన్సిని తన తల్లిదండ్రులను ఒప్పించి భారత్లో ఫిజియోథెరపీ కోర్సులో చేరింది. మరోవైపు గోవింద్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇద్దరం రెండు దేశాలకు చెందినవాళ్లమని రెండు దేశాల సంస్కృతులను తెలుసుకుంటూ ఒకరినొకరం అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పుకొచ్చింది హన్సిని. "నా కూతురు ఉన్నత చదువుల కోసం భారత్ వెళతానంటే అందుకు ఒప్పుకున్నాను. ఇక ఇక్కడ అబ్బాయితో పరిచయం అయ్యిందని తెలిశాకా ఆ అబ్బాయిని శ్రీలంకకు తీసుకొచ్చి కొన్ని నెలలపాటు మాఇంట్లోనే పెట్టుకున్నాం. ఆ అబ్బాయి మాకు నచ్చడంతో వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం" అని శ్రీలంకలో లాయరుగా పనిచేస్తున్న హన్సిని తండ్రి చెప్పారు. అంతేకాదు తాము బౌద్ధ మతంను అనుసరిస్తున్నామని చెప్పిన హన్సిన తండ్రి... గోవింద్ కుటుంబం కూడా శాఖాహారులు కావడం తమకు కలిసొచ్చిందని వెల్లడించారు. భారత్లో ప్రజలు ఎంతో మానవత్వం కలిగి ఉండటమే కాకుండా మంచి సహాయం చేసే గుణం కూడా ఉందంటూ హన్సిని తండ్రి చెప్పారు.