డేరా బాబాకు పదేళ్ల జైలు శిక్ష: మోడీపై స్పందించిన రాధే మా
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో సన్యాసిని రాథేమా స్పందించారు.
న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన నేపథ్యంలో సన్యాసిని రాథేమా స్పందించారు. ఏది జరిగినప్పటికీ అంతా దేవుడి కృప, కర్మల ఫలితంగానే జరుగుతుందన్నారు.
గుర్మీత్పై సిబిఐ కోర్టు తీర్పు అనంతరం పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాథేమా మాట్లాడారు. ఈ విషయంపై ఎక్కువగా ఆలోచించదల్చుకోలేదని, నేను నా సొంత వాళ్లతోనే ఉంటానని, పరమేశ్వరుడి సేవలో బిజీగా ఉన్నానని, వాస్తవానికి నేను ఇంట్లో నుంచి అడుగుపెట్టడడం కూడా తక్కువేనని, ఏది జరిగినా అది ఆ భగవంతుడి దయవల్లే జరుగుతుందన్నారు.
ఓ వైపు అంతా జరగాల్సిందే జరిగిందని చెబుతూనే మరోవైపు తాను వివాదాల్లోకి వెళ్ల దల్చుకోలేదని రాథేమా అన్నారు. తాను సన్యాసిని కాదు, గురువునూ కాదు.. కేవలం ఓ అమ్మను మాత్రమే అన్నారు. అద్దాలతో మేడలు కట్టిన వారికే గాయాలవుతాయనీ, వాళ్ల గురించి తాను మాట్లాడబోనన్నారు.
అయితే తన ఇంటిని రాళ్లతో కట్టుకున్నందున తన గురించి చెప్పడానికి ఏం లేదన్నారు. తన ఇంటిని కాచుకోవడానికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల వరుసగా నకిలీ బాబాలంతా జైలుకు వెళ్తుండటంపై కూడా రాథేమా స్పందించారు. 'మోడీజీకి నా వందనాలు. ఆయన, ఆయన ప్రభుత్వం చాలా జ్ఞానంగల వారు. వారి నిర్ణయాలన్నీ నేను గౌరవిస్తాను. మోడీ ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారు' అని పేర్కొన్నారు.
రాథేమా తన అత్తమామలతో కలిసి వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ ఓ యువతి ఆమెపై కేసు పెట్టారు. డాలీ బింద్రా అనే నటి కూడా రాథేమాపై లైంగిక వేధింపులు, బెదిరింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రాథేమా భక్తులు ఆమెను చేతులపై ఎత్తుకున్నట్టు బయటికి వచ్చిన ఓ వీడియో ఆమెను మరిన్ని వివాదాల్లోకి లాగింది.