రాజస్ధాన్ సంక్షోభం కాంగ్రెస్కు మేలు చేసిందిలా- రాహుల్ రోల్పై క్లారిటీ - త్వరలో కీలక నిర్ణయాలు...
రోజుకో మలుపు తిరిగిన రాజస్ధాన్ సంక్షోభం చివరికి టీ కప్పులో తుఫానుగా ముగిసిపోయింది. పార్టీ బలంగా ఉన్నప్పటికీ అధికారం కోల్పోయే పరిస్ధితి నుంచి తిరిగి అసమ్మతి రేపి పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తిరుగుబాటు నేత సచిన్ పైలట్ను తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చే వరకూ హైడ్రామాను తలపించిన ఈ సంక్షోభం కాంగ్రెస్ పార్టీకి వరమయ్యేలా కనిపిస్తోంది. గతంలో ఇలాంటి పరిస్ధితుల్లోనే పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. దీన్ని అధిగమించడంలో చూపిన తెగువ ఇప్పుడు ఆ పార్టీకి ఓ క్లారిటీ కూడా ఇచ్చేసింది. పార్టీకి ఎవరి నాయకత్వం అవసరమో, సంక్షోభాలను ఎలా అధిగమించాలో శతాథిక పార్టీకి దిశానిర్దేశం చేసింది.
Recommended Video
సంక్షోభంతోనే అవకాశం..
రాజస్ధాన్ లో అసంతృప్త నేత సచిన్ పైలట్ రేపిన సంక్షోభానికి ముందు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పెట్టుకున్న గడువు ముగిసిపోయింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగాల్సి ఉంది. పార్టీలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్దితి లేదు. అలాగని పగ్గాలు స్వీకరించేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేదు. చివరికి అనివార్యంగానే మరోసారి మరికొంతకాలం సోనియాగాంధీ పార్టీ బరువు మోసేందుకు సిద్ధమయ్యారు. అలాంటి సమయంలో రాజస్ధాన్లో సంక్షోభం తలెత్తింది. గతంలోలా ఓ ప్రణబ్లానో మరొకరి లాగో సంక్షోభ పరిష్కర్తలు లేరు. ఉంటే యువనేతలు, లేకపోతే వృద్ధ నేతలు.. వీరిద్దరితోనూ పని కాదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో అనూహ్యంగా రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ తనకు అత్యంత విశ్వసనీయ నేతలైనా ముగ్గురితో కలిసి రాజస్ధాన్ సంక్షోభాన్ని అతి తక్కువ సమయంలో చక్కబెట్టేశారు.
ముగ్గురు ట్రబుల్ షూటర్లు...
కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ కోటరీ నేతలుగా పేరొందిన కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, రణదీప్ సూర్జేవాలా రాజస్ధాన్ సంక్షోభ పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. రాహుల్ సూచనలతో జైపూర్లో అడుగుపెట్టిన వీరు.. సంక్షోభాన్ని రోజుకో మలుపు తిప్పారు. పోరాడేందుకు బీజేపీకి అవకాశం లేకుండా చేశారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన్ పైలట్తో రోజూ మాట్లాడుతూ అశోక్ గెహ్లాట్ను వెనక్కి తగ్గేలా చేశారు. చివరికి పైలట్ కోరికలను మన్నిస్తూనే అశోక్ గెహ్లాట్కు ఇబ్బంది లేకుండా సంక్షోభాన్ని పరిష్కరించారు. చివరికి సచిన్ పైలట్ను రాహుల్, ప్రియాంకతో మాట్లాడించి మరీ ఈ సంక్షోభానికి తెరదించారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ ముగ్గురి పేరు మార్మోగిపోతోంది.
రాహుల్ పాత్రపై క్లారిటీ...
గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్గీ పగ్గాలు చేపట్టి ఘోర పరాజయం ఎదురుకాగానే విరక్తితో అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీపై పార్టీలోనే అనుమానాలు, అవమానాలు తప్పలేదు. పార్టీ నేతల సెటైర్లను భరిస్తూ రాహుల్ గాంధీ అలాగే ఏడాదిగా కాలం గడిపేస్తున్నారు. కానీ మరోసారి పగ్గాల స్వీకరణకు మాత్రం ముందుకు రావడం లేదు. తల్లి సోనియాగాంధీ అనారోగ్యంతోనే బాధ్యతలు మోస్తున్నా కనికరం లేదు. కానీ రాజస్ధాన్ సంక్షోభంలో కీలకంగా వ్యవహరించడం ద్వారా పార్టీకి తన నాయకత్వం అవసరానన్ని రాహుల్ మరోసారి గుర్తు చేశారన్న వాదన వినిపిస్తోంది. అన్నింటికీ మించి నాయకుడిగా కీలక సమయంలో రంగంలోకి పరిస్ధితిని తమకు అనుకూలంగా మార్చడంలో రాహుల్ ప్రదర్శించిన తెగువ ఇప్పుడు బీజేపీకి సైతం పీడకలగా మారిపోయింది.
త్వరలో కీలక నిర్ణయాలు...
రాజస్ధాన్ సంక్షోభం నేర్పిన పాఠాలు కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీని ఆయన కోటరీని కూడా సంతోషంలో నింపేశాయి. గతంలో పిల్ల చేష్టలతో ఇబ్బందులు కొని తెచ్చుకున్న రాహుల్ గాంధీ కొంతకాలంగా ఆత్మవిశ్వాసంగా కనిపిస్తున్నారు. ప్రసంగాల్లో జోష్ కనిపిస్తోంది. అయితే వాటిలో ఇంకా పరిణితి పెరగాల్సి ఉంది. అయితే రాజస్ధాన్ సంక్షోభం నేపథ్యంలో పార్టీని రక్షించేందుకు రాహుల్ గాంధీ ఆయన నమ్ముకున్న వ్యక్తులు సరిపోతారనే భావన వ్యక్తమవుతోంది. దీంతో ఇదే ఊపులో రాహుల్ పార్టీ పగ్గాలు స్వీకరించడంతో పాటు ట్రబుల్ షూటర్లు, ఇతర కీలక స్ధానాలను భర్తీ చేసేందుకు యువ నేతలు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల దిశగా వెళ్లొచ్చని చెబుతున్నారు.