కరోనా.. భారత్లో ఏ స్థాయిలో విజృంభించనుందో తెలుసా.. ఇదిగో మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్..
చూస్తుండగానే భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపుగా 500 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9మంది మృత్యువాత పడ్డారు. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెంత దిగజారుతుందోనన్న ఆందోళన ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. నిర్లక్ష్య ధోరణితో తీరని మూల్యం చెల్లించుకున్న ఇటలీ ఉదంతం ఓవైపు కనిపిస్తూనే ఉన్నా.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్లను చాలాచోట్ల ప్రజలు పట్టించుకోని పరిస్థితి. దీంతో భవిష్యత్తులో భారత్ పరిస్థితేంటి అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ ఒక జర్నల్ను ప్రచురించింది.
జర్నల్లో ఏముంది.. పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందా..
కరోనా వైరస్ వ్యాప్తిని ఆశావాద దృక్పథంతో అంచనా వేస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10లక్షల 5వేల మందికి వ్యాపించే అవకాశం ఉందని మెడికల్ కౌన్సిల్ జర్నల్లో పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ,ముంబై,కోల్కతా,బెంగళూరు నగరాల్లో 5లక్షల వరకు కేసులు నమోదవవచ్చునని తెలిపారు. ఫిబ్రవరి నుంచి కేసుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే.. అప్పటినుంచి 200 రోజుల వ్యవధిలో వైరస్ వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకుని పైన పేర్కొన్న సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
ఒకవేళ చేతులెత్తేస్తే..
ఒకవేళ వైరస్ నియంత్రణ విషయంలో భారత్ చేతులెత్తేస్తే పరిస్థితి చైనాను,ఇటలీని మించిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్టు జర్నల్లో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని నిరాశావాద దృక్పథంలో అంచనా వేస్తే... ఫిబ్రవరి నుంచి 50రోజుల వ్యవధిలో ఢిల్లీలో ఒక కోటి కేసులు,ముంబైలో 40లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అదే సమయంలో ఒకవేళ ఊహాత్మక,ఆశావాద దృక్పథం నుంచి చూసినప్పుడు భారత్లో గరిష్టంగా నమోదయ్యే కేసులు తక్కువగానే ఉండవచ్చునని వెల్లడించారు. దాని ప్రకారం వైరస్ వ్యాప్తి మొదలైన నాటి నుంచి 700 రోజుల వ్యవధిలో ఢిల్లీలో 2లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అయితే కరోనా లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరినీ.. లక్షణాలు బయటపడ్డ మూడు రోజుల వ్యవధిలో క్వారెంటైన్ చేయగలిగినప్పుడే ఇలాంటి నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
వాటి ఆధారంగా రిపోర్ట్..
అయితే మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ప్రచురించిన ఈ జర్నల్ పూర్తిగా మ్యాథమెటికల్ మోడల్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. వైరస్ ఇండియాలో ప్రవేశించడానికి ద్వారాలైన ఢిల్లీ,ముంబై,కోల్కతా,బెంగళూరు వంటి నగరాల్లోని విమానాశ్రయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్ను తయారుచేసినట్టు తెలిపారు. ఆయా ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చిన దాదాపు 1.5లక్షల మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. కానీ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ జర్నల్ లెక్క మాత్రం మరోలా ఉంది. దాని అంచనా ప్రకారం విమానాశ్రయాల్లో చేసిన స్క్రీనింగ్ టెస్టుల్లో కరోనా వైరస్ సోకిన 46శాతం మంది విదేశీ ప్రయాణికులను గుర్తించలేకపోయారు. ఒక అధ్యయనం ఆధారంగా ఈ గణాంకాలను అంచనా వేస్తున్నట్టు మెడికల్ కౌన్సిల్ జర్నల్ తెలిపింది.
Recommended Video
సగం కంటే ఎక్కువమందికి స్క్రీనింగ్ టెస్టులు చేయలేదా..?
మరో అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ అనుమానితులుగా ఉన్న సగం మంది కంటే ఎక్కువ విదేశీయులకు భారత విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టులు చేయలేదు. నిజానికి ఈ స్క్రీనింగ్ టెస్టులను ప్రభుత్వం ఫిబ్రవరిలో నిర్వహించలేదు. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ టెస్టుల కోసం ఫాస్ట్ టెస్ట్ కిట్స్ అందుబాటులో లేకపోవడం కూడా స్క్రీనింగ్ టెస్టుల ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. భారత్లో అడుగుపెట్టిన విదేశీ ప్రయాణికుల సంఖ్య పెరిగిపోవడంతో భారత్లో అడుగుపెట్టినవారందరి శాంపిల్స్ను లేబోరోటరీలో టెస్ట్ చేయడం కూడా అసాధ్యమని చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ రెండో స్టేజ్లో ఉంది. మూడో దశలోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది.