జయలలితకు శశికళ ఎలా దగ్గరైంది, భర్త దూరమైనా శశికళ ఎందుకు జయతోనే ఉంది
కలెక్టర్ ఇంట్లో ఆయాగా పనిచేసిన శశికళ చివరకు జయ పరిచయంతో ఆమె దశ తిరిగింది.
చెన్నై:అన్నాడిఎంకెలో జయశకం ముగిసింది. ఇక శశికళ శకం ప్రారంభమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. శశికళకే పార్టీ పగ్గాలను అప్పగించేందుకు నాయకులు సిద్దమయ్యారు.అయితే కలెక్టర్ ఇంట్లో ఆయాగా పనిచేసిన శశికళ తమిళనాడులో పాలక పార్టీని తన చెప్పుచేతల్లోకి తీసుకొనే స్థాయికి ఎదిగింది. జయతో పరిచయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
కలెక్టర్ ఇంట్లో ఆయాగా పనిచేసిన శశికళ వీడియో షాపు ఏర్పాటుచేసింది. జయతో పరిచయం ఆమె జీవితాన్ని మార్చివేసింది.కొంతకాలంపాటు జయకు దూరమైనా తిరిగి ఆమె అదే స్థానంలో తిరిగి వచ్చారు.
జయకు కుటుంబ సభ్యుల కంటే శశికళ అత్యంత ఆప్తురాలైంది. జయ అంటే శశికళ, శశికళ అంటే జయ అనే అభిప్రాయాన్ని కల్గించేలా శశికళ వ్యవహారించారు. జయ కుటుంబ సభ్యులు, బంధువులు ఆమెకు దూరమయ్యారు. అయితే శశికళ కుటుంబసభ్యులు , బంధువులు జయకు దగ్గరయ్యారు.
జయతో పాటు ఆమె నివాసంలోనే ఉంటూ ఆమెకు మరింత దగ్గరయ్యారు. పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఆసక్తి శశికళను జయకు మరింత దగ్గరగా చేసింది. మరో వైపు జయ ఇబ్బందుల్లో ఉన్న కాలంలో ఆమెను ఓదార్చిన సానుభూతి కూడ శశికళను జయతోపాటే ఉంచుకొనేలా చేసింది.
కలెక్టర్ ఇంట్లో ఆయాగా పనిచేసిన శశికళ
శశికళకు పిల్లలు లేరు.అయితే పెద్ద వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలనే ఆసక్తి శశికళ కు ఉండేది.అయితే ఈ ఆసక్తి, ఉత్సాహామే శశికళను జయలలితకు దగ్గరగా చూసింది. శశికళ భర్త నటరాజన్ కలెక్టర్ చంద్రలేఖ వద్ద పార్ట్ టైమ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేసేవారు. ఆ సమయంలో శశికళ కెసెట్ లెండింగ్ లైబ్రరీ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, వీడియో కవరేజీ షాపు ఏర్పాటు చేయాలని కలెక్టర్ నటరాజన్ కు సలహా ఇచ్చారు. అయితే ఈ సలహాతో శశికళతో వీడియో కవరేజీ షాపు ఏర్పాటు చేయించాడు నటరాజన్..అప్పుడే చంద్రలేఖకు బిడ్డ పుట్టింది. అయితే చంద్రకళ బిడ్డ ఆలనాపాలనా చూసేందుకు ఆమె ఆయాగా వెళ్ళారు. శశికళకు పిల్లలు కూడ లేరు.ఇది కూడ చంద్రకళ వద్ద ఆయాగా పనిచేసేందుకు కారణమైందనే అభిప్రాయం ఉంది.
జయతో ఎలా పరిచయం ఏర్పడింది
ఎంజిఆర్ బతికున్న సమయంలో జయలలిత అన్నాడిఎంకె ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించేవారు. తన ప్రసంగాలను రికార్డు చేసి ఇచ్చేందుకు ఓ వ్యక్తి కావాలని జయకు అవసరమైంది. చంద్రకళ ద్వారా జయలలితకు శశికళ పరిచయమైంది. ఈ సందర్భ:గా వీరిద్దరికీ పరిచయం పెరిగింది. ఎంజిఆర్ బతికున్న కాలంలోనే జయను పార్టీనుండి బయటకు పంపేందుకు చేసే కుట్రలపై శశికళ ఓదార్చేదని చెబుతుంటారు.దీంతో శశికళతో ఆమెకు సంబంధం మరింతగా పెరిగిపోయింది.
కుటుంబసభ్యులు, బంధువుల కంటే అత్యంత సన్నిహితమైన శశికళ
పరిచయమైన తర్వాత జయ వెన్నంటే ఉంది శశికళ. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, జయతోనే నడిచారు.కష్టాల్లో, సుఖాల్లో కూడ జయ కు ఆమె అండగా ఉన్నారు. శశికళ అన్న కొడుకు సుధాకరన్ ను జయ దత్తత తీసుకొంది. ఆయనకు 1996 లో ఘనంగా వివాహం చేసింది. ఈ వివాహం కారణంగా ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఎదుర్కొంది.జయతో పాటు శశికళ కూడ ఈ కేసులో అరెస్టయ్యారు. డిఎంకె పెట్టిన ప్రతి కేసులో కూ జయతో పాటు శశికళ పేరును చేర్చారు.తనకు తోడ పుట్టని సోదరి శశికళ అని జయలలిత ప్రకటించారు.
జయకు శశికళ సలహాలు
2001 ఎన్నికల్లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చింది..అయితే కేసుల కారణంగా ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేకపోయారు.ఈ సమయంలో పన్నీరు సెల్వం ను ముఖ్యమంత్రిని చేయాలని శశికళ సలహా ఇచ్చారని పార్టీలో ప్రచారంలో ఉంది. జయను అమ్మగా పిలుచుకొంటే శశికళను చిన్నమ్మగా పిలిచేవారు.పార్టీ శ్రేణులు , మంత్రులు కూడ అమెను అదే గౌరవంతో చూసేవారు. 2011లో జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత శశికళ కుటుంబసభ్యులు పోయెన్ గార్డెన్ కు వచ్చేవారు. దీంతో శశికళను జయ బయటకు పంపారు. శశికళ కుటుంబానికి చెందిన రావణన్, కలియపెరుమాళ్ళు, మిడాస్ మోహన్ లపై కేసులు పెట్టించింది జయ. అయితే ఈ కేసులపై శశికళ ఎలాంటి కోపాన్ని జయపై ప్రదర్శించలేదు. తన వారిని కూడ ప్రదర్శించకుండా నిలువరించారు.దీంతో జయ తిరిగి శశికళను పిలిపించుకొన్నారు. శశికళ లేకుండా ఉండలేనని ఆమె చెప్పేవారట.
కుటుంబ సభ్యులు దూరమైనా
శశికళ కుటుంబసభ్యులు పోయెన్ గార్డెన్ నుండి ఒక్కొక్కరుగా దూరమయ్యారు. శశికళ భర్త నటరాజన్ ను ఈ ఇంటికి దూరంగా ఉంచారు. ఆయనపై కేసులు పెట్టారు. పార్టీ కోశాధికారి, ఎంపి దినకర్ ను పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. దత్తపుత్రుడు సుధాకరన్ పై కేసు నమోదైంది.ఒక్కొక్కరుగా జయ ఇ:టి నుండి బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయినా శశికళ మాత్రం జయను వదిలి వెళ్ళలేదు.