కొందరి వద్ద లక్షల కొత్త కరెన్సీ ఎక్కడిది?: మోడీ ప్రభుత్వానికి సుప్రీం
నోట్ల రద్దు నేపథ్యంలో కొందరి చేతుల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పోతున్నాయో చెప్పాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం నాడు ప్రశ్నించింది.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో కొందరి చేతుల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పోతున్నాయో చెప్పాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం నాడు ప్రశ్నించింది. కొందరు పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీని ఎలా పొందుతున్నారని అడిగింది.
దేశంలో పెద్దనోట్ల రద్దు అంశం పైన సుప్రీం కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి లక్షల కొద్దీ కొత్తనోట్లు ఎలా చేరుతున్నాయని కేంద్రాన్ని నిలదీసింది. కొత్తనోటు కోసం సామాన్యులు పడిగాపులు కాస్తున్నారని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం దేశంలో రెండు రకాల ప్రజలు ఉన్నారనీ, కట్టలకొద్దీ కొత్తనోట్లు ఉన్నవారు ఒకరైతే, చేతిలో చిల్లిగవ్వలేని వారు మరొకరని వ్యాఖ్యానించింది.
కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ రోహత్గీన్యాయస్థానానికి తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
సామాన్యులు వారానికి రూ.24 వేలు తీసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురువుతోందని, కానీ కొందరి వద్ద లక్షలాది కొత్త కరెన్సీ ఎలా ఉంటుందని ఓ సమయంలో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్.. అటార్నీ జనరల్ను ప్రశ్నించారు. బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు.