గర్భిణీ ఏనుగు మృతి : కొంప ముంచిన ఆ రెండు తప్పులు.. కేరళపై కుట్ర కోణాలు..?
కేరళలో ఇటీవల వెలుగుచూసిన గర్భిణీ ఏనుగు మృతి ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఏనుగు మృతికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ఏనుగుకు ఉద్దేశపూర్వకంగానే హాని తలపెట్టారా.. లేక అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు పెట్టే బెల్లం పూసిన నాటు బాంబులను ఏనుగే తిన్నదా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయం ఇంకా ఎటూ తేలకముందే.. ఏనుగు మృతిని 'మతం'తో ముడిపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని కమ్యూనలైజ్ చేయడం వెనుక కేరళ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా ఆ రాష్ట్ర సీపీఎం నేతలు అంటున్నారు.
Recommended Video
ఆ రెండు తప్పులు..
ఏనుగు మృతి ఘటనను రిపోర్ట్ చేసిన ఓ జాతీయ మీడియా అందులో రెండు విషయాలను తప్పుగా పేర్కొంది. ఒకటి.. ఆ ఘటన జరిగింది మలప్పురం జిల్లాలో అని పేర్కొంది. రెండు.. ఫైర్ క్రాకర్స్ నింపిన పైనాపిల్ పండును ఏనుగుకు తినిపించడం వల్లే అది చనిపోయిందని చెప్పింది. కానీ ఈ రెండు అవాస్తవాలే. నిజానికి ఆ ఘటన జరిగింది పాలక్కడ్ జిల్లాలో. అలాగే ఆ ఏనుగుకు ఫైర్ క్రాకర్స్ నింపిన పైనాపిల్ పండును తినిపించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఈ రెండు విషయాలు మీడియాలో,సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగాయి.
బీజేపీ నేతలూ అదే తప్పుడు సమాచారం..
ఇప్పటికీ చాలా వరకు మీడియా సంస్థలు కూడా ఏనుగు మృతి చెందింది మలప్పురం జిల్లాలో అని రిపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఇప్పటికే తమ తప్పును సరిదిద్దుకున్నాయి. కానీ అప్పటికే ఆ వార్త అందరికీ చేరడంతో.. ఘటన జరిగింది మలప్పురం జిల్లాలోనే అని చాలామంది భావిస్తున్నారు. ఆఖరికి అధికార బీజేపీ నేతలు కూడా 'మలప్పురం' జిల్లాలోనే ఘటన జరిగిందని తప్పుడు సమాచారాన్ని చెబుతున్నారు. అంతేకాదు,మలప్పురం జిల్లాలో 70శాతం ముస్లిం జనాభానే కాబట్టి... ఏనుగు మృతిని 'మతం' కోణంలో ముడిపెట్టే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మేనకా గాంధీ వ్యాఖ్యలతో కమ్యూనలైజ్..
కేంద్రమంత్రి,జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఏనుగు మృతి ఘటనను కమ్యూనలైజ్ చేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేరళలోని మలప్పురం జిల్లా దేశంలోనే అత్యంత హింసాత్మకమైనదిగా ఆమె అభివర్ణించారు. ఆ జిల్లాలో ఓసారి పాయిజన్ను రోడ్లపై విసిరిస్తే 300-400 కుక్కలు,పక్షులు చనిపోయాయని పేర్కొన్నారు. కానీ మేనకా గాంధీ పేర్కొన్నట్టు ఏనుగు మృతి చెందినది మలప్పురం జిల్లాలో కాదు,పాలక్కడ్ జిల్లాలో. అలాగే పాయిజన్ను రోడ్లపై పడేస్తే 300-400 పక్షులు,కుక్కలు చనిపోయాయన్న దానికి ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవు. జంతు ప్రేమికులు,కార్యకర్తలు కూడా అలాంటి ఘటన గురించి తాము ఇంతవరకూ వినలేదంటున్నారు.
కుట్రలు.. ఆ ప్రతిష్టను దెబ్బతీసేందుకే..
ఏనుగు మృతి ఘటనను కేరళ రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్షరాస్యతలో దేశంలోనే నం.1 అయిన కేరళ మానవత్వం విషయంలో మాత్రం చివరి స్థానంలో ఉందంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిప్పి కొట్టారు. ఇటీవల కోవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొని అందరిచేత ప్రశంసలు పొందిన కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఏనుగు మృతి ఘటనను కమ్యూనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. దాన్ని అడ్డం పెట్టుకుని కేరళపై లేనిపోని విమర్శలు చేయడం సరికాదని అన్నారు. బీజేపీ నేతలకు వేరే ఎజెండా ఉందని ఆరోపించారు. అదే సమయంలో ఏనుగు మృతికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బెల్లం పూసిన నాటు బాంబు వల్లే...
ముస్లిం లీగ్ యువ విభాగం అధ్యక్షుడు సయ్యిద్ మునవ్వర్ అలీ మాట్లాడుతూ.. ఏనుగు మృతి ఘటన చాలా బాధాకరం అన్నారు. అయితే దాన్ని ఆ ఘటనను మలప్పురంలో జరిగిందని అబద్దాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులను కూడా గుర్తించినట్టు విజయన్ ఇప్పటికే ప్రకటించారు. అడవి పందుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఉపయోగించే బెల్లం పూసిన నాటు బాంబుల వల్లే ఏనుగు చనిపోయి ఉండవచ్చునని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.