వీరజవాన్లు: 'బారాముల్లా' దాడిని ఇలా చిత్తు చేశారు!
న్యూఢిల్లీ: బారాముల్లాలో ఆదివారం రాత్రి ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు వీర జవాన్లు, ఇంటెలిజెన్స్ నివేదికలు లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. బారాముల్లా శివారుల్లోని జన్బాజ్పోరా వద్ద సరిహద్దు భద్రతాదళం 40వ బెటాలియన్ ఉంది.
ఇక్కడ సెంట్రీ విధులు నిర్వహిస్తున్న జవాన్ ఆదివారం రాత్రి బహిరంగ వంటశాల ప్రాంతంలో అనుమానాస్పద కదలికను గుర్తించాడు. ఉగ్రవాదులు శిబిరంలోకి ప్రవేశించి ఉండవచ్చన్న అనుమానంతో కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల శబ్దంతో సమీపంలో ఉన్న సైనిక శిబిరంలో కలకలం చెలరేగింది.
ఆ శిబిరంలో 46 రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులున్నారు. అనుమానిత ఉగ్రవాదులు ప్రవేశించారని భావిస్తున్న దిశగా వారు కూడా కాల్పులు ప్రారంభించారు. అన్ని వైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారా లేదా బయటి నుంచే కాల్పులు వస్తున్నాయా అన్నది స్పష్టం కాలేదు.
గంటన్నర కాల్పుల అనంతరం పరిసరాల్లో వెలుగులు చిమ్మే ఇల్యుమినేటర్లను ఉపయోగించారు. అయినా ఉగ్రవాది ఎవరూ కనిపించలేదు. అప్పటికే వారు చీకట్లో కలిసిపోయారు.
కాల్పుల్లో బీఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు నితిన్, పుల్విందర్ గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు షూట్ అండ్ స్కూట్ వ్యూహాన్ని అనుసరించారంటున్నారు. అంటే ఒకచోట కాల్పులు జరిపి అక్కడి నుంచి వెంటనే మరో చోటుకు తరలిపోవడం.