అగ్నిప్రమాదం: ఈ చిన్న ట్రిక్తో పదో తరగతి అమ్మాయి వారి ప్రాణాలు కాపాడింది
ముంబై: మహారాష్ట్రలోని ముంబై క్రిస్టల్ టవర్లో బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఎలక్ట్రికల్ వైరింగులో లోపం వల్ల 17 అంతస్తులు ఉన్న ఆ భవనంలో 12వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఓ పదో తరగతి అమ్మాయి ట్రిక్ పలువురిని కాపాడింది.
ముంబైలో మరో అగ్ని ప్రమాదం...పరేల్ ప్రాంతంలోని భవంతిలో చెలరేగిన మంటలు
తాను తరగతి గదిలో చదివిన పాఠాలను నిత్య జీవితంలో ఉపయోగించింది. దీంతో తన కుటుంబ సభ్యులతో పాటు పొరుగువారి ప్రాణాలను కాపాడింది. ఆ బాలిక పేరు జెన్ సదావర్తే. వయస్సు పదిహేనేళ్లు. పదో తరగతి చదువుతోంది. పలువురి ప్రాణాలు కాపాడి ఆమె హీరో అయింది.
ఇంతకు ఆమె ఏం చేసిందంటే... అగ్ని ప్రమాదం సమయంలో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అప్పుడు ఆమె నిద్రపోతోంది. పొగలు చూసి తల్లి కంగారు పడి కూతురును నిద్రలేపింది. అప్పటికే ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. అందరూ కంగారుపడుతుంటే, సదావర్తే చాకచక్యంగా వ్యవహరించింది.
ఇలాంటి సమయంలో ఏం చేయాలో తాను చదువుకున్న పాఠ్య పుస్తకాలను గుర్తు చేసుకుంది. ఓ రుమాలును తీసుకొని దానిని కొద్దిపాటి నీటితో తడిచేసి దానిని ముక్కుకు, నోరుకు అడ్డంగా పెట్టుకోవాలని పేరెంట్స్కు సూచించింది. వాటి ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల్లోకి చేరదని చెప్పింది.
కొన్ని దుస్తులను చించి పక్కన ఉన్న కుటుంబాలకు ఇచ్చింది. తాము ఎలా చేశామో అలా చేయమని చెప్పింది. వెంటనే కిందకు దిగమని అగ్నిమాపక సిబ్బంది చెప్పగా.. అందరూ లిఫ్ట్ వైపు వెళ్లారు. అప్పుడు సదావర్తి.. లిఫ్ట్ వైపు వెళ్లవద్దని, మెట్లు ఉపయోగించి దిగాలని, లిఫ్ట్లో వెళ్తే ఊపిరితీసుకోవడం కష్టమవుతుందని చెప్పింది.
తాను నిద్రలేచేసరికి దట్టమైన పొగ కమ్ముకుందని, అది ఇంట్లోకి కూడా వచ్చిందని, ఆ సమయంలో తనకు తన ఉపాధ్యాయులు చెప్పిన పాఠం గుర్తుకు వచ్చిందని, ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆలోచించాలని గుర్తు చేసుకున్నానని, ఇలాంటి సమయంలో ఊపిరి తీసుకోవడం, ఏమాత్రం కంగారుపడకుండా పరిస్థితిని గమనించడం చేయాలని తమ టీచర్ చెప్పిందని, అలాగే చేశానని, అలాగే కాటన్ క్లాత్కు నీటిని తడిపి ఉపయోగించాలని చెప్పిందని, అలాగే చేశానని చెప్పింది.
నేను ఎవరి ప్రాణాలు కాపాడలేదని, ఏం చేయాలో మాత్రమే చెప్పానని అన్నారు. వారు అలా చేయడంతో బతికిబయటపడ్డారని, అలా 16, 17 మంది బయటపడ్డారని చెప్పింది.