తివారీ ఏడ్చారు, నాకూ కన్నీరొచ్చింది: రోహిత్ శేఖర్
న్యూఢిల్లీ: న్యాయ పోరాటం చేస్తున్న రోహిత్ శేఖర్ను ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ తన కొడుకుగా అంగీకరించడం వెనక పెద్ద కథే నడిచింది. అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి రోహిత్ శేఖర్ను తన కుమారుడిగా అంగీకరిస్తూ తివారీ గుండెలకు హత్తుకున్నారు. పితృత్వం కేసులో రోహిత్ శేఖర్పై తివారీ ఆరేళ్ల పాటు పోరాటం చేశారు. చివరకు ఈ నెల 3న ఉజ్వల, తన కుమారుడు రోహిత్తో కలిసి మీడియా ముందుకు వచ్చారు..
అతడికి ఇవ్వడానికి తనవద్ద ఏమీ లేదంటూనే చట్టబద్ధ వారసుడుగా ప్రకటించారు. ఇదంతా ఎలా జరిగిందనే విషయాన్ని రోహిత్ ఎన్డీటీవీ బ్లాగులో వివరించారు. కేసు విచారణ తుది ఘట్టంలో తివారీ వివాదాన్ి కోర్టు బయట పరిష్కరించుకోవాలని భావించారు. ఆ మేరకు సంకేతాలు కూడా పంపారు. కానీ, తానందుకు ససేమిరా అన్నానని వెల్లడించారు.
తాను కోర్టులోనే తేల్చుకోవాలనుకున్నానని, కానీ తివారీ ఆరోగ్యం క్షీణిస్తోందని తన తల్లికి సమాచారం అందిందని, ఈ దశలో తివారీని చూడాల్సిందిగా అమ్మ అడిగినా తాను అంగీకరించలేదని, ఇంతలో తివారీ చికిత్స కోసం ఢిల్లీకి వస్తున్నారని, అప్పుడైనా కలవాలని ఆమె కోరారని, అయినా తాను అంగీకరించలేదని, 'కావాలనుకుంటే ఆమెను వెళ్లాలని చెప్పానని వివరించారు.
తన తల్లి ఉజ్వల వెళ్లి తివారీని కలిసిందని, తివారీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని, వెళ్లి కలవాలని చెప్పిందని, దాంతో అమ్మతో కలిసి ఢిల్లీ వెళ్లానని, తనను చూడగానే తివారీ ఏడవడం ప్రారంభించారని చెప్పారు. తివారీని అంతకుముందు తొమ్మిదేళ్ల క్రితం కలిశానని, ఇప్పుడు బాగా వయసు మీద పడిందని, చేతులు వణుకుతున్నాయని, మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటే తన గొంతులో ఏదో అడ్డుపడిన భావన అని రోహిత్ వివరించారు.
తనను తివారీ కౌగిలించుకున్నారని, తనకూ కన్నీరు ఉబికి వచ్చిందని, తివారీ తనకు ఒక శాలువా కప్పి, తలపై నెహ్రూ టోపీ పెట్టారని, పక్కనే ఉన్న తీవారీ సిబ్బంది.. 'అరె, అచ్చం మీలాగే ఉన్నాడే' అన్నారని ఆయన అన్నారు. తాను ఎందుకు తనను కొడుకుగా అంగీకరించడం లేదని తివారీని అడిగానని చెప్పారు. తాను అందుకు సిద్ధంగా ఉన్నానని, అందరినీ పిలువాలని చెప్పారని రోహిత్ శేఖర్ వివరించారు.