రెండో దశలో 45ఏళ్లు పైబడినవారికీ కరోనా వ్యాక్సిన్, కానీ, షరతులు వర్తిస్తాయి: ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి వ్యాక్సినేషన్ పూర్తవగా.. రెండో దశ కార్యక్రమాన్ని మార్చి 1 నుంచి ప్రారంభించేందకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశలో 60ఏళ్లకు పైబడినవారికే మొదటి ప్రాధన్యత ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ర్గాలు తెలిపాయి.
కరోనా తీవ్రతను బట్టే.. రెండో దశలో 27 కోట్ల మందికి వ్యాక్సిన్
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందనే సెర్టిఫికేట్ ఉన్న 45ఏళ్లకు పైబడిన వారికి కూడా రెండో దశలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. అంతకుముందు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 60ఏళ్లకు పైబడినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
45ఏళ్లకు పైబడినవారిలో కరోనాతోపాటు ఇతర వ్యాధులతో బాధపడేవారికి కూడా రెండో దశలోనే వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం ఈ దశలో 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనుండగా, వీరిలో సుమారు 10 కోట్ల మందికిపైగా వృద్ధులు ఉండవచ్చని తెలిపారు.
ఈ కేటగిరీలోకి వచ్చేవారు ఒక ఫాం నింపాలి..
కరోనాతపాటు గుండె, ఊపరితిత్తులు, కిడ్నీ, లివర్, డయాబెటీస్, క్యాన్సర్, ఆస్తమా, మెంటల్, ఇతర పలు వ్యాధులుండి కరోనాతో బాధపడేవారికి రెండో దశలు టీకా ఇవ్వనున్నారు. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. ఈ కేటగిరీలో వచ్చేవారు అవును/కాదు అనే ఒక ఫాం నింపి జనరల్ ఫిజిషియన్తో సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. వారు టీకా కోసం వ్యాక్సిన్ కేంద్రాలకు తప్పక రావాల్సి ఉంటుంది.
ప్రైవేట్ సెంటర్లలో షాట్ ధర రూ. 300
ప్రైవేటు వ్యాక్సిన్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ డోసు ధర రూ. 300 వరకు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రం వ్యాక్సిన్ డోసు ఉచితంగానే ఇవ్వబడుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునేవారు కోవిన్(కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలీజెన్స్ నెట్వర్క్) యాప్లో తమ పేరును నమోదు చేసుకుని, సమీపంలోని వ్యాక్సిన్ సెంటర్ ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపాయి.
ఆధార్ వివరాలతో వ్యాక్సిన్ అపాయింట్మెంట్
ప్రస్తుతం ఈ యాప్లో ఎంపిక చేసినవారు, ప్రభుత్వ ఉద్యోగుల వరకే పరిమితమైంది కానీ, త్వరలోనే వీరందరికీ అందుబాటులోకి రానుంది. ఒకసారి యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు తమ ఆధార్ కార్డ్ వివరాలను, ఫొటో ఐడీని, సంతకం చేసిన మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వారు సమీపంలోని కేంద్రంలో వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ పొందుతారు. అనంతరం ఆ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండ్రోజుల్లో మెడికల్ సెర్టిఫికేట్స్ కూడా రాష్ట్రాలకు చేరతాయని వెల్లడించాయి. ఈ సెర్టిఫికేట్లు ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనూ అందుబాటులో ఉండనున్నాయి.
అత్యవసర వినియోగానికి స్పుత్నిక్ వీ దరఖాస్తు
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ఆస్ట్రాజెనికా-ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేసిన, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాలు వినియోగిస్తున్నారు. తాజాగా, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అత్యవసర వినియోగానికి కేంద్రాన్ని అనుమతి కోరింది. ఒకవేళ కేంద్రం నుంచి అనుమతి లభిస్తే ఈ మూడో వ్యాక్సిన్ కూడా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.