పట్టాలు తప్పిన హౌరా-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్... పలువురికి గాయాలు
కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. రూమా రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు.
Poorva Express derailment: One National Disaster Response Force (NDRF) team of 45 persons has reached the spot. Rescue operation underway. pic.twitter.com/b69w3AiwnB
— ANI UP (@ANINewsUP) April 19, 2019
హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో 13 మంది గాయపడినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అమిత్ మాల్వియా అధికారికంగా ప్రకటించారు. వారందరినీ చికిత్స కోసం హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత వెంటనే మరో రైలును ఏర్పాటు చేసి దాదాపు 900 మంది ప్రయాణికులను తరలించినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలులోని ఎస్ 8, ఎస్ 9, బీ 1, బీ5, హెచ్ 1, ఏ1, ఏ2, ప్యాంట్రీ కార్, ఎస్ఎల్ఆర్ బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.
ఘటన జరిగాక సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, సీనియర్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే రిలీఫ్ ట్రైన్, వైద్య సిబ్బందిని అలహాబాదు, కాన్పూరుల నుంచి రప్పించారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. 1072, 9454403738, 9454401463, 9454401075, 9454400384 , 0512-23333111/112/113. పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో ఒక రైలును రద్దు చేయగా మరో 13 రైళ్లను దారి మళ్లించింది రైల్వే శాఖ.