ఆన్ లైన్ లో 4 క్లాసులు చాలు.. ఒక్కోటి 45 నిమిషాలు దాటొద్దు.. కేంద్రం కీలక మార్గదర్శకాలు..
కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా తగ్గలేదు. మూడు నెలలుగా స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు ఎక్కడికక్కడే మూతపడి ఉన్నాయి. విద్యా సంవత్సరం ఇంకా మొదలు కాలేదని ప్రభుత్వం చెబుతున్నా.. కొన్ని ప్రైవేటు సంస్థల మాత్రం సిలబస్ కానిచ్చేస్తున్నాయి. ఆన్ లైన్ లో గంటలకొద్దీ క్లాసులు నిర్వహిస్తూనే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ఫిర్యాదులు వస్తుండటంతో కేంద్రం ఎట్టకేలకు డిజిటల్ ఎడ్యుకేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది.
కాంగ్రెస్కు సచిన్ గుడ్ బై.. ముహుర్తం.. గెహ్లాట్ బలం 104.. బీజేపీ రివర్స్ గేర్..పైలట్ క్రాష్ ల్యాండ్
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం 'ప్రగ్యత' పేరుతో ఆన్ లైన్ జర్నల్ ను విడుదల చేశారు. ఇందులో డిజిటల్ విద్యా విధానానికి సంబంధించి అనేక నిబంధనలు, సూచనలు, సలహాలను పొందుపర్చారు. విద్యార్థులతోపాటు స్కూల్ హెడ్స్, టీచర్లు, తల్లిదండ్రులు, మానిటర్లకూ ఉపయోగపడేలా 'ప్రగ్యత'ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఆన్ లైన్ విద్యపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది.
ఆన్ లైన్ విద్యకు సంబంధించి 'ప్రగ్యత'లో.. ప్లాన్, రివ్యూ, అరేంజ్, టాక్, గైడ్, అసైన్, ట్రాక్, అప్రిసియేట్.. ఇలా ఎనిమిది అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఏ స్థాయి విద్యార్థులకు స్క్రీన్ టైమ్ ఎంత ఉండాలి, ఎన్ని క్లాసులు నిర్వహించాలనేదానిపైనా హెచ్చార్డీ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు 30నిమిషాలకు మించి క్లాసు నిర్వహించరాదని స్పష్టం చేసింది. అలాగే,
1 నుంచి 8వ తరగతి వరకు రెండు సెషన్లు మాత్రమే నిర్వహించాలని, అది కూడా 30 నుంచి 45 నిమిషాల లోపే(ఒక్కో సెషన్) ఉండాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక 9 నుంచి 12వ తరగతి వరకు నాలుగు సెషన్లు నిర్వహించుకోవచ్చని, ఒక్కో సెషన్ 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉండాలని చెప్పింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 'ప్రగ్యత' పేరుతో ఈ గైడ్ లైన్స్ రూపొందించినట్లు మంత్రి రమేశ్ తెలిపారు.