ఇక తరగతులకు జేఎన్యూ విద్యార్థులు: ఫీజు పెంపుపై వెనక్కి తగ్గిన కేంద్రం, పేద విద్యార్థులకు సహకారం
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపును నిరసిస్తూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్యూలో హాస్టల్ ఫీజులు పెంచడం లేదని జేఎన్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆర్ సుబ్రమన్యం స్పష్టం చేశారు.
మళ్లీ భగ్గుమన్న జేఎన్యూ: ఫీజు తగ్గించాలంటూ స్టూడెంట్స్ నిరసనలు.. బంద్కు పిలుపు
హాష్టల్ ఫీజు పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు జేఎన్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిందని సుబ్రమణ్యం తెలిపారు. అంతేగాక, ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు సాయాన్ని అందజేసేందుకు ఓ కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇక విద్యార్థులు తరగతులకు వెళ్లే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
గత కొద్ది రోజులుగా ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళనలను నిర్వహించారు. ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచితే పేద విద్యార్థులు ఎలా చదువుతారని ప్రశ్నించారు. రెండు వారాలుగా విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
#JNU Executive Committee announces major roll-back in the hostel fee and other stipulations. Also proposes a scheme for economic assistance to the EWS students. Time to get back to classes. @HRDMinistry
— R. Subrahmanyam (@subrahyd) November 13, 2019
రెండ్రోజుల క్రితం బారికేడ్లను తోసుకుంటూ యూనివర్సిటీ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట కూడా జరిగింది. యూనివర్సిటీ ఎదుటే దీక్షలు చేపట్టారు. పలువురు జేఎన్యూ విద్యార్థి సంఘం నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.